హైదరాబాద్
ప్రభుత్వం వెంటనే దళిత బంధు పథకం లాగే గిరిజన బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఎల్బి నగర్ లోని మన్సూరాబాద్ లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎరుకల సంఘం నాయకులు బుడ్డా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే గిరిజన బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న 12 మంది గిరిజన ఎమ్మెల్యేలు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ పై గిరిజన బంధు పథకాన్ని ప్రవేశపెట్టేటట్లు ప్రకటన చేయించాలని లేనిపక్షంలో ఆదివాసీ దినోత్సవం ఆగస్టు 9 లోపు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాజీనామా చేయని పక్షంలో ఎమ్మెల్యేల ఇండ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తిరిగి ఉప ఎన్నికల్లో గెలిపించే బాధ్యత తమదే అని అన్నారు. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దళితబందు పథకాన్ని ప్రవేశపెట్టారని అక్కడ ఉన్న గిరిజనులు గుర్తుకు రాలేదా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించారు. గిరిజనులపై వివక్ష ఎందుకు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన యువకులు ఉద్యోగాలు లేక కూలి పనులు చేసుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు.