కేఆర్ఎంబీ- జీఆర్ఎంబీ సంయుక్త సమావేశనికి తెలంగాణ అధికారులు డుమ్మా
హైదరాబాద్ ఆగష్టు 3
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల (కేఆర్ఎంబీ- జీఆర్ఎంబీ )సంయుక్త సమన్వయ కమిటీ సమావేశం జలసౌధలో ప్రారంభమైంది. ఏపీ నుంచి ఇరిగేషన్ ఈఎన్సీలు, ట్రాన్స్కో, జెన్కో సీఎండీలు, బోర్డు మెంబర్లు హాజరయ్యారు.కాగా సంయుక్త సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరు అయ్యారు. టైం షెడ్యూల్ ఇచ్చినా తెలంగాణ ప్రభుత్వం తరపున ఎవరూ హాజరుకాలేదు. వృధాగా పోతున్న కృష్ణా నీటిని తాము తీసుకుంటామంటే తెలంగాణ ఒప్పుకోవటం లేదని, తెలంగాణ వైఖరిపై ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి మండిపడ్డారు. సముద్రంలో కలిసే నీటిని లెక్కగట్టాలని తెలంగాణ అంటోందని, గోదావరిలో మున్ముందు సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి వాటా 1454 టీఎంసీలని, మొత్తం నీటిని వాడుకునేందుకు తెలంగాణ ప్లాన్ వేస్తోందని విమర్శించారు. అదే జరిగితే గోదావరి డెల్టా, పోలవరం ఆయకట్టుకు నీరే ఉండదని, గోదావరి బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు తేవాలని ఏపీ డిమాండ్ చేస్తోందని నారాయణ రెడ్డి చెప్పారు.కాగా పూర్తి స్థాయి బోర్డు మీటింగ్లు నిర్వహించాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. నిన్న జీఆర్ఎంబీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాసింది. ఈరోజు కృష్ణా బోర్డు చైర్మన్కు కూడా పూర్తి స్థాయి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు లేఖ రాశారు.