తెలుగుదేశం పార్టీని మరోనేత వీడనున్నారు. ఆయన త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య త్వరలోనే పార్టీని వీడుతున్నట్లు తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహారం నచ్చకనే కృష్ణయ్య పార్టీ వీడుతున్నట్లు చెబుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలుండటం, బీసీల్లో బలమైన నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్య పార్టీని వీడతానని చెప్పడం తెలుగుదేశం పార్టీకి మింగుడుపడని పరిణామమే.తాజాగా జరుగుతున్న పరిణామాలు కృష్ణయ్యను వేదనకు గురిచేశాయంటున్నారు. బీసీలపై ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కృష్ణయ్య మండిపడుతున్నారు. ఇటీవల విజయవాడలో సమావేశం పెట్టి కొత్తపార్టీ పెట్టాలని కూడా ఆయన ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఏపీలో కృష్ణయ్య ఉన్న సంఘానికి కనీసం గుర్తింపు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. దీంతో కృష్ణయ్య పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం చంద్రబాబుకు చెప్పి మీరీ పార్టీని వీడాలని కృష్ణయ్య నిర్ణయించుకున్నట్లు తెలిసింది.రాష్ట్రం విడిపోకముందు కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ నెత్తినపెట్టుకుని చూసుకునేది. ఆయనను గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా తెలంగాణలో ఆ పార్టీ ప్రకటించింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని బీసీ ఓటర్లను కూడా ఆకట్టుకునేందుకే ఈ ప్రకటన చేశారన్నది అప్పట్లో చర్చనీయాంశమైంది. కాని గత నాలుగేళ్లుగా కృష్ణయ్య పార్టీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమల్లో పాల్గొనడమే మానేశారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఎవరూ గుర్తించని పరిస్థితి ఏర్పడింది.