హైదరాబాద్/యాదాద్రి భువనగిరి ఆగష్టు 5
ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామం వాసాలమర్రికి దళితబంధు నిధులు విడుదల చేశారు. దళితబంధు అమలుపై ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున వాసాలమర్రివాసులకు దళితబంధు పథకం తొలి ప్రయోజనం అందనుంది.నిధులు విడుదల కావడంతో వాసాలమర్రి గ్రామస్తులు సంబురాలు చేసుకున్నారు. నిధుల మంజూరుపై జీవో జారీ కావడంతో గ్రామస్తులు డప్పులు కొడుతూ, చక్కెర తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మహిళలు బతుకమ్మలు ఆడి ఆనందంలో మునిగారు. తమను లక్షాది కారిని చేశారంటూ దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సీఎం కేసీఆర్ బుధవారం వాసాలమర్రి గ్రామంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆ పర్యటనలో భాగంగా దళితవాడలో తిరిగి వారి పరిస్థితులు కళ్లారా చూసి చలించిపోయారు. దీంతో అప్పటికప్పుడే నిర్ణయించుకుని దళిత బంధు తొలిగా వాసాలమర్రికే అందించాలని ఆదేశాలు ఇచ్చారు. రేపే మీకు రూ.10 లక్షలు వస్తాయని చెప్పి వెళ్లారు. ఈ మేరకు గురువారం ఎస్సీ అభివృద్ధి శాఖ నిధులు విడుదల చేసింది.