యూరియా సరఫరా చేయండి
హైదరాబాద్
బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలో ఇఫ్కో ప్రతినిధులతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ భేటీకి ఇఫ్కో మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్, జీఎం జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ కృపా శంకర్ తదితరులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ పంటల ప్రణాళిక ప్రకారం తెలంగాణకు యూరియా సరఫరా చేయండి. గత ఏడేళ్లలో తెలంగాణలో పంటల సాగు గణనీయంగా పెరిగింది. సాగునీటి సరఫరా, రైతుబంధు, రైతుభీమా, ఉచితంగా 24 గంటల కరంటు సరఫరా మూలంగా వ్యవసాయం మీద రైతులకు నమ్మకం కుదిరిందని అన్నారు.
వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి పండుగ అనే పరిస్థితికి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ధాన్యం దిగుబడిలో తెలంగాణ దేశంలో రెండో స్థానానికి చేరింది. రైతుల ఆత్మహత్యలు తగ్గి ఆత్మవిశ్వాసంతో వ్యవసాయం చేస్తున్నారు. తెలంగాణలో పంటల సాగుకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయాలి. తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటు కోసం ఇఫ్కో సమావేశంలో చర్చించగలరు. దక్షిణ తెలంగాణలో నానో యూరియా ప్లాంట్ ఏర్పాటుతో దక్షిణ భారతదేశం మొత్తానికి అందుబాటులో ప్లాంటు ఉంటుదని అన్నారు.