మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్ ఆగష్టు 6
నగరంలోని ఫతేనగర్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రూ. 317 కోట్లతో 100 ఎంఎల్డీ సామర్థ్యంతో మురుగు నీటి శుద్ధి ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీంతో పాటు రూ. 1280 కోట్లతో 17 ఎస్టీపీలు నిర్మించబోతున్నామని స్పష్టం చేశారు. 17 ఎస్టీపీ కేంద్రాల్లో 376.5 ఎంఎల్డీల మురుగునీరు శుద్ధి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.ఫతేనగర్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు శంకుస్థాపన చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హైదరాబాద్కు పరిశ్రమలు, పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఉపాధి కల్పన పెద్ద ఎత్తున జరగుతుంది. ప్రతి ఏడాది లక్షల మంది హైదరాబాద్కు వస్తున్నారు. దీంతో కొత్త కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇండ్లు నగరనానికి నలు వైపులా పెరుగుతున్నాయి. ప్రతి రోజు హైదరాబాద్లో 1,950 ఎంఎల్డీల మురికిని ఉత్పత్తి చేస్తున్నారు. అందులో దాదాపు 90 నుంచి 94 శాతం మురికి నీరు గ్రావిటీ ద్వారా మూసీ నదిలోకి వెళ్తుంది. అలా మురికి నీరు మూసీ నుంచి కృష్ణా నది, ఆ తర్వాత సముద్రంలో కలుస్తోంది. ఆ మురికి నీరును ట్రీట్మెంట్ చేసేందుకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకుంటున్నాం. గతంలో భోలక్పూర్లో మంచి నీరు, మురికి నీరు లైన్లు కలిసిపోయి 9 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిని చూశాం అని కేటీఆర్ గుర్తు చేశారు.మురికినీటిని శుద్ధి చేయడం అత్యంత ప్రాధాన్యం కలిగిన పని అని కేటీఆర్ పేర్కొన్నారు. భారతదేశంలో 8 మహానగరాలు ఉన్నాయి. వీటన్నింటిలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్లో దాదాపు 40 శాతం(772 ఎంఎల్డీల) మురికి నీటిని ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తున్నాం. కానీ ఇది సరిపోదు. ఇంకా 1200 ఎంఎల్డీల దాకా మురికి నీరు మిగిలి ఉంది. ఈ నీటిని ఎప్పటికప్పుడు శుద్ధి చేయకపోతే.. మనం అనుకున్నట్లు విశ్వనగరంగా రూపొందించుకోలేం. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్స్లో రూ.1,280 కోట్లతో 17 ఎస్టీపీలు కట్టబోతున్నాం. వీటి స్థాపిత సామర్థ్యం 376.5 ఎంఎల్డీలు. దాదాపుగా 55 నుంచి 60 శాతానికి ట్రీట్మెంట్కు పోతాం. మరో 40 శాతం మిగిలి ఉంటుంది. ఆ 40 శాతాన్ని పూర్తి చేసేందుకు మరిన్ని ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామన్నారు.కూకట్పల్లి సర్కిల్లోని ప్రగతి నగర్లో ఉండే అంబీర్ చెరువు మీద ఒకటి, చిన్న మైసమ్మ చెరువు వద్ద, నల్ల చెరువు, ఖాజాకుంట, ఎల్లమ్మకుంట చెరువు, ఫతేనగర్లోని నాలా మీద ఎస్టీపీలు నిర్మిస్తామన్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్లో వెన్నలగడ్డ, చింతల్ డివిజన్లోని గాయత్రీనగర్ వద్ద, ఫాక్స్ సాగర్ చెరువు వద్ద, శివాలయ నగర్ చెరువు వద్ద, పరికి చెరువు వద్ద ఎస్టీపీలు ఏర్పాటు చేస్తామన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్లో మియాపూర్లోని పటేల్ చెరువు వద్ద, గంగారం చెరువు వద్ద, ముల్లకత్తువా చెరువు వద్ద, కాముని చెరువు వద్ద, దుర్గం చెరువు వద్ద, ఖాజాగూడ చెరువు వద్ద ఎస్టీపీలను నిర్మిస్తామన్నారు.