ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ ఆశయాలను సాధించాలి
- జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.
వరంగల్ అర్బన్
ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ సార్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఆచార్య జయశంకర్ జయంతి దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఆచార్య ప్రొ.జయశంకర్ గారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య జయశంకర్ జయంతిని స్టేట్ ఫంక్షన్ లాగా నిర్వహిస్తున్నామని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చిత్రపట్టానికి నివాళులర్పిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ప్రొ.ఆచార్య జయశంకర్ పాత్ర మరువలేనిదని, ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక సంక్షేమ అభివృద్ది పథకాలను అధికారులు క్షేత్రస్థాయిలో కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర అభివృద్ది కొరకు మంచి ప్రణాళికలు సైతం రుపొందించారని , ఆయన ఆశయాల సాధన కోసం మనమంతా సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు.
అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిప్రధాత, నాలుగు కోట్ల ప్రజలతో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ. కొత్తపల్లి జయశంకర్ సార్ అని అన్నారు. తెలుగు, ఉర్దూ,హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న ఆచార్య ప్రొ. జయశంకర్ స్వరాష్ట్రం సాధన కోసం తన జీవితాన్నే అంకితం చేసారని అదనపు కలెక్టర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సమీకృత కలెక్టరేట్ భవనములో గల జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.