భావి భారత పౌరుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి ఆగష్టు 9
భావి భారత పౌరుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్రంలో మొదటి డిజిటల్, కంప్యూటర్ ఎయిడెడ్ ఆన్ లైన్ బోర్డును లాంఛనంగా ప్రారంభించి మంత్రి మాట్లాడారు.ప్రతి ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థే అని అన్నారు. వైద్యరంగం మీద దృష్టి సారించి గతంలో నాలుగు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయగా, తాజాగా ఏడు నూతన మెడికల్, నర్సింగ్ కళాశాలలు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. వచ్చే ఏడాదిలో మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభిస్తామన్నారు.అలాగే నూతనంగా 600 గురుకులాలు ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సన్నబియ్యం అన్నం, బాలికలకు హెల్త్ కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వనపర్తి జడ్పీ బాలికల పాఠశాల 8,9,10వ తరగతి విద్యార్థులకు డిజిటల్ పాఠాల నిర్వహణ కోసం కంప్యూటర్, ఇతర పరికరాలు, 3డీ పాఠాల నిర్వహణకు కావాల్సిన సదుపాయాలను మంత్రి కల్పించారు. ఉపాధ్యాయుల అనుభవం, సూచనల ఆధారంగా నియోజకవర్గంలో మరిన్ని పాఠశాలలకు విస్తరిస్తామన్నారు.