రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలన్నింటిపైన చర్చించేందుకు సీఎం కేసీఆర్.. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలతో తెలంగాణ మంత్రుల కమిటీ భేటీ అయింది. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలో మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డిలతో నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల సంఘంతో పాటు పలు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత కొంత కాలంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్చేస్తున్నారు. ఈ మేరకు 18 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి సమర్పించాయి. ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేయడం, వేతన సవరణ కమిషన్ను తక్షణమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు సీపీఎస్ పథకాన్ని తొలగించి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రవిభజన సందర్భంగా ఏపీకి వెళ్లిన తెలంగాణ ప్రాంత అధికారుల్ని వెనక్కి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య కార్డుల జారీ తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు.మంత్రి ఈటల రాజేందర్ సారథ్యంలోని కమిటీలో సభ్యులుగా ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఉన్నారు. ఈ ముగ్గురు మంత్రులు ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమై ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల సారాంశాన్ని సీఎం కేసీఆర్కు మంత్రుల కమిటీ సమర్పించనుంది.