రానున్న నాలుగైదు రోజుల్లో ఈదురుగాలులో కూడిన వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసినట్టు జీహెచ్ఎంసీ ఇన్చార్జీ కమిషనర్ భారతిహోలికేరి తెలిపారు. నేడు జీహెచ్ఎంసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ గురువారం నాడు దాదాపు 70కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, అకస్మిక వర్షంతో నగరంలో 138 ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడ్డాయని, 131 చెట్లు కూలాయని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దింపడం వల్ల ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చూశామని తెలిపారు. మరో నాలుగైదు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపినందున ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు అన్నారు. నగరంలో ఉన్న హోర్డింగ్లు, యూనిపోల్స్ల పట్ల తగు భద్రత చర్యలు చేపట్టాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు జారీచేశామని అన్నారు. ప్రతి జోన్లో నీటి నిల్వల ప్రాంతాలు, మ్యాన్హోల్ సమస్యలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో వెంటనే స్పందించేలా తగు సిబ్బందిని ఏర్పాటు చేయాలని క్షేత్ర అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఎలాంటి ఉపద్రవం సంభవించిన ఎదుర్కునేందుకుగాను జీహెచ్ఎంసీలో విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాన్ని పటిష్టపర్చామని తెలియజేశారు.