దేశంలోని చారిత్రక కట్టడాలను దత్తత తీసుకోవడానికి ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు పోటీపడుతున్నాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంయుక్తంగా ప్రారంభించిన 'అడాప్ట్ ఏ హెరిటేజ్' కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ చారిత్రాత్మక ఎర్రకోటను దాల్మియా గ్రూపు ఇప్పటికే దత్తత తీసుకుంది.దత్తత కోసం ఎర్రకోట, తాజ్మహల్, చార్మినార్, గోల్కొండ కోట, కోణార్క్ సూర్య దేవాలయం వంటి దాదాపు 100 చారిత్రక కట్టడాల పేర్లను ప్రకటించింది. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ (సీఎస్ఆర్) చర్యల్లో భాగంగా చారిత్రక కట్టడాల సంరక్షణలో కార్పోరేట్ సంస్థలను భాగస్వామ్యం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. బిడ్లో చారిత్రక కట్టడాలను సొంతం చేసుకున్న కంపెనీలు ఐదేళ్లపాటు వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది.. ఇప్పుడు ఈ కోవలోకి జీఎంఆర్ స్పోర్ట్స్, ఐటీసీ హోటల్స్ సంస్థలు కూడా చేరిపోయాయి. హైదరాబాద్కు తలమానికంగా నిలుస్తున్న చారిత్రక కట్టడం చార్మినార్ను దత్తత తీసుకోవడానికి ఐటీసీ హోటల్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు సర్కారుకు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాన్ని విడుదల చేసింది. అందుబాటులో ఉన్న సమాచారం మేరు చార్మినార్ను దత్తత తీసుకోవడానికి ఐటీసీ తప్ప మరే ఇతర కపెంనీ దరఖాస్తు చేసుకోనట్టు తెలుస్తోంది. దీంతో ఐటీసీ విన్నపాన్ని 'అడాప్ట్ ఏ హెరిటేజ్ ప్రాజెక్ట్ ఓవర్సైట్ అండ్ విజన్ కమిటీ' ఆమోదిస్తూ చార్మినార్ను ఐటీసీకి అప్పగించడం దాదాపు ఖాయమైపోయింది. కాగా, ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్ జట్టును ప్రొమోట్ చేస్తోన్న జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ గోల్కొండ కోటను దత్తత తీసుకోవడానికి దరఖాస్తు చేసుకుంది. వాస్తవానికి జీఎంఆర్ స్పోర్ట్స్ ఏడు చారిత్రక కట్టడాల
దత్తత కోసం దరఖాస్తు చేసింది. వాటిలో ఢిల్లీలోని ఎర్రకోట, గోల్కొండ కోట కూడా ఉన్నాయి. ఇప్పటికే ఎర్రకోటను దాల్మియా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇక గోల్కొండ కోట దత్తత విషయం సర్కారు పరిశీలనలో ఉంది. 'మేం ఎర్రకోట సహా మొత్తం ఏడు కట్టడాల దత్తత కోసం ఈఓఐ సమర్పించాం. కానీ ఎర్రకోటను దాల్మియాకు దత్తత ఇచ్చారు. గోల్కొండ కోట కోసం మా దరఖాస్తును షార్ట్ లిస్ట్ చేశారు. ఈ మేరకు మేం అంగీకార లేఖ కూడా ఇచ్చాం. ఇక ఇప్పుడు విజన్ బిడ్ వేయాల్సి ఉంది. ప్రాజెక్ట్ నిబంధనల ప్రకారం మా బిడ్ను కమిటీ పరిశీలిస్తుంది. మా బిడ్ కనుక ఎంపిక అయితే మేం ప్రభుత్వంతో గోల్కొండ దత్తత నిమిత్తం ఒక ఎంవోయూ చేసుకోవాల్సి ఉంటుంది' అని జీఎంఆర్ స్పోర్ట్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. చారిత్రక కట్టడాల సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కిందటేడాది సెప్టెంబరులో 'అడాప్ట్ ఏ హెరిటేజ్' ప్రాజెక్ట్ను ప్రారంభింది.