YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొండా సురేఖ కండిషన్స్

కొండా సురేఖ కండిషన్స్

వరంగల్, ఆగస్టు 21, 
హుజురాబాద్ బై పోల్స్‌లో తన పేరును ప్రకటిస్తే బరిలో నిలిచేందుకు తాను సిద్దంగానే ఉన్నానని పీసీసీ అధిష్టానం పెద్దలకు చెప్పిన కొండా సురేఖ తన లక్ష్యం మాత్రం 2023 ఎన్నికలేనని చెప్పారట. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండా సురేఖ పేరును కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. బుధవారం రావిల్యాలలో జరిగిన దళిత, గిరిజన దండోరా సభలో ఆమె పేరుతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటిస్తారని వార్తలొచ్చినా అది జరగలేదు. అయితే అందుకు కారణం కొండా సురేఖే అని అని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను హుజురాబాద్‌లో పోటీ చేసేందుకు ఆమె కొన్ని డిమాండ్లను పీసీసీ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. వాటిని పరిశీలించడం వల్లే సురేఖ పేరు ప్రకటించడం వాయిదా పడిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పెద్దలు ఆ డిమాండ్లకు ఓకే చెప్పడంతో రెండు మూడు రోజుల్లో ఆమె పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.హుజురాబాద్ ఉపఎన్నికల్లో తన పేరును ప్రకటిస్తే బరిలో నిలిచేందుకు తాను సిద్దంగానే ఉన్నానని కొండా సురేఖ పీసీసీ అధిష్టానానికి చెప్పారట. అయితే తన లక్ష్యం మాత్రం 2023 ఎన్నికలేనని, మరో ఏడాదిన్నరలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తేనే హుజురాబాద్‌లో పోటీ చేసేందుకు సిద్ధమని సురేఖ స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. ఉప‌ఎన్నికల్లో పోటీ చేసి తన బలాన్ని పెంచుకుంటానని, అందువల్ల 2023లో ఆ సీటు మళ్లీ తనకే కేటాయించాలని డిమాండ్ చేశారట.దీంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ అర్బన్, పరకాల, భూపాలపల్లి టికెట్లను తాను చెప్పిన వారికి ఇస్తానని కూడా ఇప్పుడే హామీ ఇవ్వాలని సురేఖ అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం. అయితే భూపాలపల్లి విషయంలో అధిష్టానం కొంత మీనామేషాలు లెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న గండ్ర సత్యనారాయణ రావు పేరును భూపాలపల్లికి పరిశీలిస్తున్నందున ఆమెను ఒప్పించే ప్రయత్నంలో కొంత మంది పెద్దలు నిమగ్నమైనట్లు సమాచారం. భూపాలపల్లి విషయంలో వెనక్కి తగ్గితే వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్, పరకాల, వరంగల్ అర్బన్ స్థానాల్లో అభ్యర్థుల ఖరారు నిర్ణయం అమెకే వదిలేయాలన్న నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చినట్లుగా తెలుస్తోంది హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గాల ప్రాబల్యం ఎక్కువ కావడంతో అదే కేటగిరీకి చెందిన కొండా సురేఖను నిలబెడితే పార్టీకి బలం చేకూరుతుందని పీసీసీ పెద్దలు ఆలోచించారు. అంతే కాకుండా టీఆర్ఎస్, ఈటల వ్యతిరేక వర్గాన్ని ఆకట్టుకోవాలంటే కొండా సురేఖ లాంటి బలమైన నాయకురాలు బరిలో ఉంటేనే పార్టీకి మరింత ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైనా అక్కడ గెలిచే అభ్యర్థుల తలరాతలను మార్చే అవకాశం మాత్రం కాంగ్రెస్ పార్టీకే ఉంటుందని నేతలు భావిస్తున్నారు. కొండా సురేఖ బరిలో ఉంటేనే అధికార టీఆర్ఎస్‌కు ముచ్చెమటలు పట్టించొచ్చని కాంగ్రెస్ పార్టీలో మెజార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందువల్ల రెండు మూడు రోజుల్లో ఆమె అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది

Related Posts