రాష్ట్ర న్యాయవాదుల సంక్షేమం కోసం చేపట్టబోయే పలు పథకాలను జూన్ 2న ప్రారంభించాలని తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ ట్రస్ట్ నిర్ణయించింది. న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి చాంబర్ లో శనివారం జరిగిన ట్రస్ట్ సమావేశంలో ఎంపీ వినోద్ కుమార్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, ట్రస్ట్ కార్యదర్శి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి బాచిన రామాంజనేయులు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్ రావు, రాజేందర్ రెడ్డి, సహోదర్ రెడ్డి, మానిక్ ప్రభు గౌడ్, వెంకట్ యాదవ్, విద్యాసాగర్ రావు, మహమూద్ అలీ, ట్రస్ట్ సలహా మండలి సభ్యులు,ఇతర న్యాయవాదులు పాల్గోన్నారు. న్యాయవాదులకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం, బార్ అసోసియేషన్లకు మౌలిక సదుపాయాలు కల్పనపై సమావేశంలో చర్చించినట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. మూడు కీలక పథకాలను
జూన్ 2న ప్రారంభిస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. అదే రోజు లాంచనంగా కొంత మంది న్యాయవాదులకు హెల్త్ కార్డులను జారీ చేస్తామన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన న్యాయవాదుల సేవలను గుర్తించిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు వారి సంక్షేమ నిధికి రూ.100 కోట్లను కేటాయించారని మంత్రి వెల్లడించారు.
న్యాయవాది, అతని జీవిత భాగస్వామికి రూ.2 లక్షల మేరకు ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయడం. మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు ప్రమాద బీమా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం. ఆయా జిల్లాల్లోని బార్ అసోసియేషన్లకు మెరుగైన వసతుల కల్పన పర్నీచర్, లైబ్రరీ,ఇతర నిర్వహణ ఖర్చుల కోసం న్యాయవాదుల సంఖ్యను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.50 వేల వరకు ఆర్థిక సాయం అందించడం. నల్సార్ విశ్వ విద్యాలయం సహకారంతోజూనియర్ న్యాయవాదులకు క్రిమినల్, సివిల్ ప్రోసీజర్ కోడ్, డ్రాఫ్టింగ్ పై శిక్షణ తరగతులు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. న్యాయవాది యొక్క అతని/ ఆమె జీవిత భాగస్వామితో పాటు వారి మైనర్ పిల్లలకు కూడా ఆరోగ్య బీమా పథకం వర్తింపజేయాలని ట్రస్ట్ సభ్యులు,న్యాయవాదులు మంత్రిని కోరారు.గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.100 కోట్ల నిధులకు వచ్చిన రూ.23 కోట్ల వడ్డీని న్యాయవాదుల సంక్షేమానికి ఖర్చు చేయాలని ట్రస్టు తీర్మానించింది.