సికింద్రాబాద్ తార్నాక డివిజన్ పరిధిలో మాణికేశ్వరి నగర్ రూ .15.50 లక్షల ఖర్చుతో నిర్మించనున్న వర్షపు నీటి కాలువ నిర్మాణం పనులను ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్విసుల మంత్రి టీ.పద్మారావు గౌడ్ శనివారం తార్నాక డివిజన్ కార్పోరేటర్ ఆలకుంట సరస్వతి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాణికేశ్వరినగర్ లో చిన్నపాటి వర్షాలకు సైతం నీరు నిలిచిపోయే అగత్యాన్ని నివారించేలా ఏర్పాట్లు జరుపుతున్నామని వివరించారు. గడచిన నాలుగేళ్లలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులను చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్ ప్రజలకు తీరని కలగానే నిలిచిన జూనియర్, డిగ్రీ కాలేజీ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తార్నాక డివిజన్ పరిధిలో ప్రజలు ఊహించని అభివృద్ధి పనులుచేశామని, 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ ఎంసీ డిప్యూటీ కమీషనర్ రవి కుమార్, ఈ ఈ ఇందిరా బాయి, డిప్యూటీ ఈ ఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.