YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిటీలో విస్తరణకు 62 కిలోమీటర్ల రోడ్ల విస్తరణ

 సిటీలో విస్తరణకు 62 కిలోమీటర్ల రోడ్ల విస్తరణ

హైదరాబాద్  నగరంలో ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా రహదారుల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సింహ భాగం జీహెచ్‌ఎంసీ నిధులతో, కేంద్రం సహకారంతో 4 ప్రధాన ప్రాజెక్టులకు జీహెచ్‌ఎంసీ అంకురార్పణ చేసింది. అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు, ఆరాంఘర్, మెదక్ రోడ్ల విస్తరణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు.-హైదరాబాద్-ఓఆర్‌ఆర్ నుంచి మెదక్ సెక్షన్‌లో 62.92 కిలోమీటర్ల నిడివి గల డబుల్‌లేన్ల జాతీయ రహదారికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరి శంకుస్థాపన చేశారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.426.52 కోట్లు. ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్, నర్సాపూర్, కౌడిపల్లి, అప్పాజీపల్లి, రాంపూర్, మెదక్ పట్టణాల మధ్య అనుసంధానం, ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ట్రాఫిక్ సమస్యలు తగ్గనున్నాయి. -హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఆరాంఘర్, శంషాబాద్ సెక్షన్‌లో 10.48 కిలోమీటర్ల నిడివి గల ఆరు వరుసల రహదారికి కూడా శంకుస్థాపన చేశారు. దీనిని ఈపీసీ పద్ధతిన నిర్మించనున్నారు. దీని అంచనా విలువ 283.15 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లను విడుదల చేయనుంది. రాష్ట్ర రాజధానికి విమానాశ్రయాన్ని కలిపే అతి ముఖ్యమైన ఈ రహదారిని 1.2 కిలోమీటర్ల నిడివి గల ఎలివేటెడ్ కారిడార్ వంటి అధునాతన సదుపాయాలతో నిర్మించనున్నారు. రోడ్డు మధ్యమధ్యలో మూడు ఫ్లై ఓవర్లు నిర్మించనున్నారు. ఈ రూట్‌లో ట్రాఫిక్ జాంలు లేకుండా చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్టును 24 నెలల్లో పూర్తిచేయాలన్నది లక్ష్యం. అంబర్‌పేట చౌరస్తా వద్ద రూ.186.71 కోట్లతో నిర్మించనున్న 1.465 కిలోమీటర్ల నిడివి గల నాలుగు వరుసల ఫ్లై ఓవర్‌కు శంకుస్థాపన చేశారు. నిర్మాణ వ్యయానికి అదనంగా రూ.40 కోట్లు భూసేకరణకు ఖర్చు చేయనున్నారు. మొత్తం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.226.88 కోట్లుగా నిర్ధారించారు. అంబర్‌పేట ఛే నంబర్ కూడలి నుంచి శ్రీరమణ థియేటర్ కూడలి వరకు నిత్యం ఉండే ట్రాఫిక్ జాంలు ఈ వంతెనతో తీరనున్నాయి. ఉప్పల్ జంక్షన్ నుంచి వరంగల్ రహదారిలోని సీపీఆర్‌ఐ వరకు దాదాపు 6.25 కిలోమీటర్ల ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించనున్నారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.626.76 కోట్లు. నిర్మాణ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా, భూసేకరణ ఖర్చు రూ.768.26 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఉప్పల్ జంక్షన్ వద్ద మెట్రోపై నుంచి ఫ్లై ఓవర్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది. దీనికి రూ.311 కోట్లు ఖర్చవుతుందని అంచనా.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్, అంబర్ పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. 

Related Posts