YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సొంత గూటికి టీ కాంగ్రెస్ నేతలు..?

సొంత గూటికి టీ కాంగ్రెస్ నేతలు..?

హైదరాబాద్, ఆగస్టు 31, 
అదును చూసి దెబ్బకొట్టేందుకు హస్తం పార్టీ రెడీ అయ్యింది. ఇందుకోసం బహుముఖ వ్యూహాన్ని అవలంభిస్తున్నది. అధికార పార్టీలోని అసంతృప్తి నేతలే టార్గెట్‌గా ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టబోతున్నది. ఆయా నియోజకవర్గాల్లో వారికి ఎదురవుతున్న అవమానాలు, వచ్చే ఎన్నికల్లో టికెట్ రాకపోవచ్చనే అనుమానం ఉన్నవారిని లాక్కోవాలనుకుంటున్నది. ఇప్పటికే దాదాపు డజను మందికిపైగా జాబితాను రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసింది. కొద్దిమందితో రహస్యంగా, బహిరంగంగా మంతనాలు సైతం జరిపింది. సొంత పార్టీలోని సీనియర్ల సహకారం ఎలా ఉన్నా నియోజకవర్గాల్లో పటిష్ఠంగా మార్చకొనేందుకు కాంగ్రెస్ఉవ్విళ్లూరుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన కొద్దిమందికి ప్రస్తుతం పార్టీలో పెద్దగా ప్రాధాన్యం లేదు. రానున్న ఎన్నికల్లో సైతం సిట్టింగ్‌లకు టికెట్ ఖాయం అనే అభిప్రాయం నెలకొన్నది. దీంతో పార్టీలో కొనసాగినా ప్రయోజనం లేదనే అసంతృప్తిలో ఉన్న నేతలనే కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నది.ప్రత్యక్షంగా, పరోక్షంగా వారితో సంప్రదింపులు జరుపుతున్నది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి అధికార పార్టీలో చేరిపోయినవారిపై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టింది. వరుస సభలతో, ఘాటు విమర్శలతో అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఆ పార్టీలోని లుకలుకలను అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నది. దీనికి తోడు ఆదివాసీ ప్రాంతాల్లో పోడు సమస్యకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నది. స్థానికుల్లో ఉన్న అసంతృప్తికి సమాధానం చెప్పుకోలేక సతమతమవుతున్న ఎమ్మెల్యేల దయనీయ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నది. ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని నేతలతో ఒక దఫా మంతనాలు పూర్తయినట్లు కాంగ్రెస్ నేతలు ఉదహరించారు. ప్రధానమైన ఫోకస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ఉన్నదని, త్వరలోనే ఒక స్పష్టతకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున గెలిచి ప్రస్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నవారిలో ఇద్దరు ముగ్గురు మినహా మిగిలినవారంతా సొంత గూటికి రావడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేశారు.టీఆర్ఎస్ పార్టీ ఇటీవల గ్రామ స్థాయి మొదలు రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలనుకున్నది. ఈ విధానం కొన్ని చోట్ల బెడిసికొట్టే అవకాశం లేకపోలేదని కాంగ్రెస్ అంచనా వేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రాధాన్యత లేకుండా ఉండిపోయిన నేతలకు కొత్త కమిటీలో స్థానం లేదా గుర్తింపు లభించనట్లయితే ఆ అసంతృప్తి భగ్గుమనే అవకాశం ఉందని భావిస్తున్నది. సరిగ్గా ఈ పరిస్థితులే ఊహించని టర్న్ తీసుకుంటాయని, కాంగ్రెస్‌ పార్టీకి సానుకూలంగా మారుతాయని భావిస్తున్నారు. చాలా కాలంగా టీఆర్ఎస్ ను అంటిపెట్టుకుని ఉన్నవారికి, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారికి మధ్య భేదాభిప్రాయాలు తప్పవని అంచనా వేసింది. ఇది టీఆర్ఎర్‌కు ప్రతిబంధకంగా మారుతుందని, కాంగ్రెస్‌ను విడిచి వెళ్ళినవారు పునరాలోచనలో పడతారని వ్యాఖ్యానించారు. ఇప్పటికే కొత్తగూడెం, ఆసిఫాబాద్, ఇల్లెందు, వైరా తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయని కాంగ్రెస్ నేత ఒకరు గుర్తుచేశారు. ఇక కొల్లాపూర్, నకిరేకల్, తాండూరు లాంటి కొన్ని చోట్ల టీఆర్ఎస్ పట్ల అసంతృప్తితో ఉన్న అక్కడి నేతలు వచ్చే అవకాశం ఉందని ఉదహరించారు. రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ తరఫున టికెట్ రాకపోవచ్చన్న అనుమానంతో పాటు గడచిన రెండున్నరేళ్ళుగా పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకుండా ఉండిపోయిన పరిస్థితులే ఇందుకు కారణమవుతున్నట్లు పేర్కొన్నారు.సమయానుగుణంగా ఆ నేతలు నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ నాయకుడు వివరించారు. అధికార పార్టీ తీసుకునే నిర్ణయాలు, వివిధ సెక్షన్ల ప్రజల్లో పొడసూపుతున్న వ్యతిరేకత, వాటికి సమాధానం చెప్పుకోలేని నిస్సహాయ స్థితి.. ఇవన్నీ వారి అసంతృప్తికి కారణమవుతున్నట్లు వివరించారు. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు టీఆర్ఎస్ స్థానిక కమిటీల ఏర్పాటు అనే నిర్ణయం తీసుకున్నా అన్ని చోట్లా పరిస్థితులు ఆ పార్టీకి అనుకూలంగా మారబోవని, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపే వారి చూపు ఉన్నదని పేర్కొన్నారు. కొద్దిమంది విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే మరికొందరి విషయంలో వారి వైపు నుంచే కదలిక వచ్చిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ వైపు చూస్తున్నవారంతా గతంలో ఇదే పార్టీ తరఫున గెలిచినవారు లేదా అక్కడ అధికార పార్టీ తరఫున పోటీ చేసిన ఓడిపోయినవారేనని, రానున్న ఎన్నికల్లో వారికి టికెట్ ఇవ్వడానికి పెద్దగా ఇబ్బందులే ఉండవని, ఇది కూడా వారికి తమ పార్టీవైపు రావడానికి ఒక ప్రధాన కారణంగా ఉన్నట్లు వివరించారు.

Related Posts