YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అప్పుల కుప్పగా ఆంధ్ర

అప్పుల కుప్పగా ఆంధ్ర

విజయవాడ, సెప్టెంబర్ 2, 
జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటింది. అయితే ఏపీలో సమస్యలు అన్నీ కూడా ఆయన పాలన కంటే ముందే ఉన్నాయి. ఆ మాటకు వస్తే ఆరు దశాబ్దాల ఉమ్మడి ఏపీలో పదమూడు జిల్లాల ఏపీ ఎలా ఉందో కూడా అంతా చర్చించాలి. ఇక విభజన తరువాత అయిదేళ్ల పాటు చంద్రబాబు పాలన చేశారు. అంతే కాదు 90 వేల కోట్ల అప్పులతో, పాతిక వేల కోట్ల రూపాయల రెవిన్యూ లోటుతో ఏపీ ఏర్పడింది అన్న సంగతి ఇక్కడ ఎవరూ మరువరాదు. మరి అలాంటిది ఇపుడు ఏపీని అప్పుల ఆంధ్రా అని అంతా అంటున్నారే. అసలు ఏపీ పుట్టిందే అప్పులతో అన్నది ఏడేళ్ళ వ్యవధిలోనే ఎలా మరచిపోతారు అన్నది ఆర్ధిక మేధావుల మాట. చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో నాలుగేళ్ళ పాటు కేంద్రంతో పొత్తు పెట్టుకుని ఉన్నారు. మరి ఆయన హయాంలో ఏపీకి కేంద్రం ఎంత ఇచ్చింది. ఆయన ఎన్ని అప్పులు చేశారు అన్నీ కూడా చూడాలి కదా. ఇక చంద్రబాబు దిగిపోయేనాటికి రెండున్నర లక్షల కోట్ల అప్పులు కొత్తగా చేశారని వైసీపీ అంటోంది. సరే వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పులు చేస్తోంది. అయితే వాటిని సంక్షేమ పధకాల పేరిట ప్రజలకు పంచుతోంది. ఈ డబ్బులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి గతంలో టీడీపీ చేసిన అప్పుల సంగతేంటి, అవి ఎక్కడ ఖర్చు చేశారు అని జగన్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక బీజేపీ తీసుకుంటే ఈ మధ్య సౌండ్ బాగా చేస్తోంది. జగన్ ని రాజకీయంగా కొట్టడం కష్టమని భావించి ఏపీలోని ఆర్ధిక రంగం మీద పడ్డారు అన్న కామెంట్స్ ఉన్నాయి. జగన్ పధకాలను అమలు చేయడం వల్ల రాజకీయంగా బలంగా మారుతున్నారని, ఆయన ఆయువు పట్టుని నొక్కేయాలి అంటే ఆర్ధికంగా దెబ్బ తీయాలన్నది బీజేపీ హిడెన్ అజెండాగా ఉందని అంటున్నారు. ఈ మధ్య బీజేపీ టోన్ కూడా టీడీపీ మాదిరిగా మారుతోందని కూడా అనుమానిస్తున్న వారున్నారు. ఏపీని అప్పుల ఆంధ్రా అంటున్న ఎంపీ, తెలుగు వాడు అయిన జీవీఎల్ నరసింహారావుకు ఆ అప్పులు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. లక్షల కోట్లు నాడు చంద్రబాబు అప్పులుగా తెస్తే మాట్లాడని బీజేపీ పెద్దలు ఇపుడు రెండేళ్ళు కూడా కాకుండానే జగన్ సర్కార్ మీద గుండెలు బాదుకోవడం పచ్చి రాజకీయమే అంటున్నారు. ఏపీకి రెవిన్యూ లోటుగా పాతిక వేల కోట్లు రావాలి. కానీ ఏడేళ్ళుగా కేంద్రం ఇచ్చినది ఎంత అని లెక్క తీస్తే గట్టిగా నాలుగు వేల కోట్లుగా కూడా లేవు. మరి కేంద్రం విభజన చట్టం మేరకు ఆ నిధులు వెంటనే ఇవ్వాలిగా అంటున్నారు. అదే విధంగా తెలంగాణాలో ఉమ్మడి ఏపీ ఆస్తులు ఉన్నాయి. వాటి లెక్క తేల్చి ఏపీకి రావాల్సిన దాన్ని కేంద్రం ఇప్పించే ప్రయత్నం చేసిందా అంటే జవాబు లేదు. ఇలా రెండువందలకు పైగా విలువైన భవనాలు, ఆస్తులు తెలంగాణాలో ఉన్నాయి. మరో వైపు చూస్తే తెలంగాణా ఏపీకి కట్టాల్సిన విద్యుత్ బకాయిలు ఆరు వేల కోట్లకు పైగా ఉన్నాయి. వాటి విషయంలో ఇప్పించే సీన్ ఉందా అంటే లేదు అనే చెప్పాలి. ఇక ఏపీ విభజిత రాష్ట్రం, రాజధాని లేదు, అడ్డగోలు విభజనతో దారుణంగా నష్టపోయింది. మరి ప్రత్యేక హోదా ఇచ్చి నిలబెట్టారా అంటే కేంద్రం వద్ద జవాబు లేదు. కానీ అప్పులు చేస్తున్నారు అని జగన్ మీద నింద వేయడానికి బీజేపీ నేతలు తయారవుతారు అన్నది వైసీపీ నేతల ఆవేదనగా ఉంది. ఇక కరోనా దెబ్బకు దేశంలో ఏ రాష్ట్రం అప్పులు చేయకుండా ఉందని కూడా మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఏకంగా కేంద్రమే అప్పులు ఇబ్బడి ముబ్బడిగా చేయడమే కాదు ప్రభుత్వ ఆస్తులను కూడా తెగనమ్ముతూంటే బీజేపీ నేతలు మాత్రం ఏపీకే సుద్దులు చెబుతున్నారు అంటే ఎవరికైనా మండదు మరి.

Related Posts