కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పచ్చబంగారంగా పిలిచే పసుపు ధరలు ధగధగ మంటున్నాయి. గత వారం రోజులుగా స్థబ్ధుగా ఉన్న పసుపు ధరలు రెండు రోజులుగా పుంజుకుంటున్నా యి. తెగుళ్లు, ప్రతికూల వాతావరణ పరిస్థితులతో తగ్గిన దిగుబడులే ధరలు పెరిగేందుకు కారణమని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.
కేసముద్రం మార్కెట్లో కాడిరకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా రూ.7515 ధరతో ఆన్లైన్ వేలంలో ఖరీదులు చేశారు. ఒక్క రోజు వ్యవధిలో పసుపు సగటు ధరలో రూ.874లు పెరగడం గమనార్హం. మార్కెట్కు 88 మంది రైతులు 526 క్వింటాళ్ల కాడి పసుపు, 72 మంది రైతులు 158 క్విం టాళ్ల గోల రకం పసుపు విక్రయించేందుకు తీసుకువచ్చారు. ఎలకా్ట్రనిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానంలో ఆన్లైన్ టెండర్లో కాడిరకం పసుపు క్వింటాకు గరిష్ఠంగా రూ.7515, కనిష్ఠంగా రూ.6011, సగటున రూ.7211, గోలరకం పసుపునకు క్వింటాకు గరిష్ఠంగా రూ.7261, కనిష్ఠం గా రూ.6451, సగటున రూ.7051ల చొప్పున ధరల తో సరుకును వ్యాపారులు ఖరీదులు చేశారు. గతనెల 30న కాడిరకం గరిష్ఠంగా రూ.7039, కనిష్ఠంగా రూ.5501, సగటున రూ.6426 ఉండగా సగటు ధరలో క్వింటాకు రూ.874 పెరుగుదల రావడం గమనార్హం.
తగ్గిన దిగుబడులతోనే పసుపునకు రాష్ట్రీయ మార్కెట్లో డిమాండ్ పెరిగినట్లు వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు దుంపకుళ్లు తెగుళ్లతో దిగుబడి భారీగా పడిపోయింది. కేసముద్రం, వరంగల్ మార్కెట్కు మే మొదటి వారం వరకు 3లక్షల బస్తాల పసుపు విక్రయానికి రావాల్సిఉండగా కేవలం 50వేల బస్తాల వరకే రైతులు అమ్మకానికి తీసుకురావడం గణనీయంగా తగ్గిన దిగుబడిని సూచిస్తోంది. ఇక కేసముద్రం మార్కెట్కు గతేడాది ప్రస్తుత సీజన్లో నిత్యం రూ.4వేల నుంచి రూ5వేల బస్తాల పసుపు రాబడులు ఉండాల్సిఉండగా రూ.800 నుంచి రూ. 1200 బస్తాల వరకే విక్రయానికి వస్తున్నాయి. ఆన్లైన్ ఫ్యూచర్ ట్రెడింగ్లలో ప్రస్తుత ధరలకంటే నాలుగు శాతం అధిక ధరలు పెట్టి భవిష్యత్ ఖరీదులకు బుకింగ్ చేసుకుంటున్నారు. జాతీయస్థాయిలో డిమాండ్కు తగ్గ సప్లై లేకపోవడంతో ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారవర్గాలు విశ్లేషిస్తున్నాయి.