YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

దేవాదాయశాఖలో ఇంటి పోరు

దేవాదాయశాఖలో ఇంటి పోరు

విశాఖపట్టణం, సెప్టెంబర్ 20, 
విశాఖ దేవాదాయశాఖ కార్యాలయంలో కూర్చున్న ఓ అధికారిపై ఓ మహిళా ఉద్యోగి ఇసుక వేయడం. అదీ సీసీ కెమెరాలో రికార్డ్‌ కావడం.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడం.. ఆ వ్యవహారం ఎంత రచ్చ.. చర్చ అయ్యిందో.. ఇప్పుడు అదే అంశంలో మరో విషయం చర్చగా మారింది. ఈ ఏడాది ఆగస్ట్ 5న విశాఖజిల్లా డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఇంఛార్జ్‌ డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ పై అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుకతో దాడి చేశారు. ఆపై శాపనార్ధాలు పెట్టారు.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన దేవాదాయశాఖ.. ఆర్జేసీ సురేష్‌బాబుతో విచారణ చేయించింది. తగువుపడ్డ ఇద్దరు అధికారులను విచారించి ఎండోమెంట్ కమిషనర్‌కు నివేదిక సమర్పించారు. నివేదిక వివరాలు మాత్రం గోప్యంగానే ఉండిపోయాయి. ఆపై ఇరువురు అధికారుల పంచాయితీ అమరావతికి చేరింది. కమిషనర్ ఇద్దరి వాదనలు విన్నారు. కిందిస్ధాయి ఉద్యోగి బదిలీని తీవ్రంగా పరిగణించి ఏసీ శాంతి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు డీసీ పుష్పవర్ధన్. చివరకు ఇద్దరినీ మందలించి పంపించేశారు. ఈ వివాదం టీకప్పులో తుఫాన్‌గా మిగిలిపోతుందని దేవాదాయశాఖ వర్గాలు భావించాయి. ఇంతలో కీలక ఆదేశాలు వెలువడ్డాయి. వైజాగ్ ఇంఛార్జ్‌ డీసీ పదవి నుంచి పుష్పవర్ధన్‌ను తొలగించి హెడ్‌ఆఫీస్‌కు బదిలీ చేశారు. అసిస్టెంట్ కమిషనర్‌గానే కొనసాగుతారని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది దేవాదాయశాఖ.ఈ నిర్ణయం పుష్పవర్ధన్‌కే కాదు.. ఆ శాఖ ఉద్యోగులకు షాకింగ్ పరిణామం. పైగా ఏసీ శాంతిని అదేస్ధానంలో కొనసాగించడం పుష్పవర్ధన్ అవమానంగా భావించారు. తన తప్పు లేకపోయినా బదిలీ చేశారని కలత చెందిన ఆయన.. ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేశారు. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ వాణీమోహన్‌కు రిజైన్‌ లెటర్‌ ఇచ్చి హైదరాబాద్‌ వెళ్లిపోయారు. పుష్పవర్ధన్ నిర్ణయం ఇప్పుడు చర్చగా మారింది. ప్రొబేషనరీ కాలం కూడా పూర్తికాని ఒక జూనియర్‌ అధికారి తనపై ఇసుకతో దాడిచేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా తనను బాధ్యతల నుంచి తప్పించడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన ప్రశ్న.సింహాచలం ఆలయ భూముల గోల్‌మాల్‌ విచారణ కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలో పుష్పవర్దన్‌ సభ్యుడు. మాన్సాస్, బొబ్బిలి వేణుగోపాలస్వామి గుడి ఆస్తులపైనా ఆయన పనిచేస్తున్నారు. ఇలా కీలక స్థానంలో ఉన్న సీనియర్ అధికారిని అనూహ్యంగా బదిలీ చేయడం ఉద్యోగుల్లో చర్చ జరుగుతోందట. అంతా రాజకీయ ప్రమేయంతోనే జరిగిందనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. పుష్పవర్ధన్ సైతం తాజా పరిణామాలపై సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు తెలుస్తోంది. రాజీనామా నిర్ణయం వెనక బలమైన కారణంతోపాటు భయం ఉందని టాక్‌.ప్రస్తుతం ఆలయ భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ సమయంలో నిబంధనల మేరకు ఉద్యోగం కత్తిమీద సామే. అదే అభిప్రాయంలో పుష్పవర్దన్‌ ఉన్నారట. ఇతర ప్రభుత్వ శాఖలు వేటిల్లోనూ లేనివిధంగా ఇటీవల దేవాదాయశాఖలో అధికారులపై చర్యలు ఉన్నాయి. సింహాచలం భూముల వివాదంలో అప్పటి ఈవో రామచంద్రమోహన్, అసిస్టెంట్ కమిషనర్ సుజాతలపై వేటు వేసింది ప్రభుత్వం. విజిలెన్స్ విచారణ పూర్తయితే ఇంకా చాలామందిపై చర్యలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. అందుకే కీలక బాధ్యతల్లో ఉంటూ అపవాదులు మూటగట్టుకోవడం అనవసరమనే అభిప్రాయంలో పుష్పవర్ధన్ ఉన్నట్టు వినికిడి. శాఖాపరమైన అంశాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోతే.. ఇక ఎవరికోసం పనిచేయాలని ఆయన ఆవేదన చెందుతున్నారట. మరి.. ఈ ఇసుక దుమారం ఇంకెలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related Posts