YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పదవులు ఇచ్చినా మార్పు కష్టమేనా

పదవులు ఇచ్చినా మార్పు కష్టమేనా

ఏలూరు, సెప్టెంబర్ 25, 
రాజకీయాల్లో కొత్త, పాత ఉండదు. నేతల దమ్ము, దన్నును బట్టి పదవులను పొందుతుంటారు. ఏ పార్టీలో ఉన్నా, విపక్షంలో ఉన్నప్పుుడు విమర్శించినా పెద్దగా లెక్కలోకి తీసుకోరు. తమకు రాజకీయంగా ఉపయోగపడతారా? లేదా? అన్నదే చూసుకుంటారు. వైసీపీ అధినేత జగన్ సయితం అనేక మందిని తన పార్టీలో చేర్చుకున్నారు. వారికి పదవులు ఇచ్చారు. అయితే వారు పార్టీకి ఎంతమాత్రం ఉపయోగపడుతున్నారన్నది ప్రశ్నార్థకమే. వైసీపీ ఆవిర్భావం నుంచి అనేక మంది నేతలు జగన్ వెంట నడిచారు. జగన్ పార్టీ గెలుస్తుందో లేదో తెలియదు. ఆయన కేసుల్లో కూరుకుపోయి ఉన్నారు. ఎప్పుడు జైలుకు వెళతారో తెలియదు. అయినా నేతలు జగన్ ను నమ్ముకుని ఉన్నారు. అధికారంలో వైసీపీ లేకపోయినప్పటికీ తమ జేబులో నుంచి నిధులు ఖర్చు చేసి జగన్ పట్ల తమ ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. ఇలాంటి నేతలు నియోజకవర్గానికి పదుల సంఖ్యలో ఉంటారన్నది వాస్తవం. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన వెంట నమ్మకంగా ఉన్న నేతలను పక్కన పెట్టినట్లే కన్పిస్తుంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారు. రాజకీయంగా వారికి అవకాశం కల్పించారు. జూపూడి ప్రభాకర్ రావు వైసీపీ ఓటమి పాలు కాగానే టీడీపీలోకి వెళ్లి అక్కడ పదవులు అనుభవించి, తిరిగి అధికారంలోకి రాగానే జగన్ ఆయనకు నామినేట్ పోస్టు ఇచ్చారు. సామాజిక న్యాయసలహాదారును చేశారు. తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీని జగన్ చేశారు. కాపు సామాజికవర్గం కాబట్టి, భవిష్యత్ లో రాజకీయంగా ఉపయోగపడతారని జగన్ ఆయనను ఎమ్మెల్సీ చేశారు. అదే సమయంలో తన వెంట నడిచిన కాపు నేతలను మాత్రం జగన్ విస్మరించారు. ఇలా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి జగన్ పదవులు ఇవ్వడం, తమను పట్టించుకోక పోవడం, భవిష్యత్ లో పదవులు వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో పూర్తి నిరాశా నిస్పృహలో ఉన్నారు. వీరంతా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని వీడతారన్న టాక్ కూడా వినిపిస్తుంది. రాయలసీమకు చెందిన ఒక ముఖ్యనేత పార్టీని వీడేందుకు సిద్ధమవ్వడంతో మరోసారి ఇది చర్చనీయాంశంగా మారింది.

Related Posts