YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఈటలకు షాక్

ఈటలకు షాక్

ఈటలకు షాక్
కరీంనగర్, సెప్టెంబర్ 29,
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు సొంత నియోజకవర్గంలోనే ఊహించని షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్లిన ఆయనపై ఓ కుటుంబం శాపనార్థాలు పెట్టింది. తమ కొడుకును పొట్టన పెట్టుకున్నావంటూ ఓ ఆయనపై మండిపడింది. పెద్దపాపయ్యపల్లెలో సంగెం అనుమమ్మ అనే మహిళ మృతి చెందగా ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం సాయంత్రం ఈటల గ్రామానికి వెళ్లారు.అయితే అదే గ్రామంలో సంవత్సరం క్రితం మరణించిన బాషబోయిన ప్రవీణ్ యాదవ్ తల్లిదండ్రులు విజయ, మల్లయ్య ఆయన్ని అడ్డుకున్నారు. మా కొడుకు చావుకు నువ్వే కారణమంటూ మండిపడ్డారు. ‘ఏ మొహం పెట్టుకుని మా ఊరికి వచ్చినవ్‌. మా ఉసురు నీకు తగులుద్ది. నువ్వు నాశనం అయిపోతవ్‌. మట్టి కొట్టుక పోతవ్‌’ అంటూ దుమ్మెత్తిపోశారు. వాళ్లను తప్పించుకొని కారు ఎక్కేందుకు రాజేందర్‌ ప్రయత్నించగా వెంటపడి శాపనార్థాలు పెట్టారు. గ్రామస్తులు కల్పించుకుని వారిని శాంతింపజేశారు. ఈ ఘటనతో షాకైన ఈటల రాజేందర్ ఏం మాట్లాడకుండా కారెక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్న పాడి కౌశిక్ రెడ్డి.. ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత వారికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని సైతం అందించారు.
ఉద్యోగం పోవడంతో డిప్రెషన్‌కు గురై...
ప్రవీణ్‌ యాదవ్‌ హుజూరాబాద్‌ ప్రభుత్వ దవాఖానలో కేసీఆర్‌ కిట్‌ విభాగంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేసేవాడు. ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా పని చేస్తున్నాడనే కోపంతో అతనిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. ఉద్యోగం కోసం ఈటలను కలిసి బ్రతిమాలినా ఉద్యోగం తిరిగి రాలేదు. దీంతో ప్రవీణ్ డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. కొద్దిరోజులు పాటు ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా మానసికంగా కుంగిపోయి ఆరోగ్యం క్షీణించి గుండెపోటుతో మృతి చెందాడు. తన కొడుకు చావుకు ఈటల రాజేందరే కారణమని ప్రవీణ్ తల్లిదండ్రులు అప్పట్లోనే ఆరోపించారు. మంగళవారం రాజేందర్‌ తమ కంటికి కనిపించడంతో ఆ తల్లి ఆగ్రహం కట్టలు తెంచుకొన్నది. రాజేందర్‌ వెళ్లిపోయాక కూడా ఆ తల్లి అరగంట పాటు కొడుకును తలుచుకుంటూ గుండెలు బాదుకుంటూ రోదించడం అందరినీ కలిచివేసింది.

Related Posts