YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దళిత బంధు గైడ్ లైన్స్ రెడీ

దళిత బంధు గైడ్ లైన్స్ రెడీ

హైదరాబాద్, అక్టోబరు 4,
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత బంధును అమలు చేయాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. అందులో భాగంగా అర్హులైన దళితులకు ప్రభుత్వ లైసెన్సుల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ప్రతి ఏటా 2 లక్షల మందికి పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘దళిత సాధికారత’ పథకానికి సీఎం కేసీఆర్ పేరును ఖరారు చేశారు. ఈ పథకానికి ‘దళిత బంధు’ అని నామకరణం చేశారు. రాష్ట్రంలో మొదట హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా పథకాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా దళిత బంధు పథకం అమలు కోసం ప్రభుత్వం తాజాగా అదనపు విధివిధానాలను జారీచేసింది. ఎస్సీ అభివృద్ధి, సంక్షేమశాఖ అదనపు విధివిధానాలను జారీచేసింది. లబ్ధిదారులకు ఇచ్చే రూ.10 లక్షల నిధులతో సాధ్యమైతే రెండు యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇద్దరు లేదా ఎక్కువ మంది కలిసి పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. యూనిట్ల ఎంపిక పూర్తయ్యాక ఆయా రంగాల్లో లబ్ధిదారులకు రెండు వారాల నుంచి ఆరు వారాల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. లబ్ధిదారులను ప్రభుత్వమే వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి తర్పీదు ఇవ్వనుంది. ఆయా రంగాల్లో విజయవంతమైన వారితో లబ్ధిదారులకు అవగాహన కల్పించనున్నారు.దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక, వారి పేరున ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా తెరిచి, సంబంధిత పాసుపుస్తకాలను లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. ఆ ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున జిల్లా కలెక్టర్ రూ.10 లక్షలను బదిలీ చేయనున్నారు. మరోవైపు, ఎంపికైన లబ్దిదారులకు యూనిట్లను బట్టి గ్రూపులుగా వర్గీకరిస్తారు. ముఖ్యంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, రవాణా రంగం, తయారీ పరిశ్రమల రంగం, రిటైల్ దుకాణాలు, సేవలు సరఫరా రంగంగా విభజించాలని తెలిపింది. రూ. పది లక్షల యూనిట్ వ్యయం అయ్యే ప్రాజెక్టులను రీసోర్స్ బృందాలు రూపొందించాలని తెలిపింది. పది లక్షలు విలువ చేసేలా రెండు సబ్ యూనిట్లు కూడా ఉండవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఒకరి కంటే ఎక్కువ మంది లబ్దిదారులు కలిసి పెద్ద మొత్తంలో పెద్ద యూనిట్‌ ఏర్పాటు చేసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.రీసోర్ట్ బృందాలతో కలిసి జిల్లా కలెక్టర్ లబ్దిదారుల వద్దకు వెళ్లి అవగాహన కల్పించాలని రాష్ట్ర సర్కార్ తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో సూచించింది. లబ్ధిదారుని ప్రాధాన్యం, ఆసక్తి, అనుభవం, యూనిట్ ఆర్థిక సాధ్యాసాధ్యాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని వెల్లడించింది. యూనిట్ల ఖరారు అనంతరం లబ్దిదారులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. కలెక్టర్ అభిప్రాయం మేరకు ఆయా రంగాలు, యూనిట్ల అవసరాల మేరకు రెండు నుంచి ఆరు వారాల పాటు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులకు ఆయా రంగాల్లో విజయవంతమైన వారిచే అవగాహన కల్పించాలని సూచించింది. లబ్ధిదారుల కుటుంబాలకు యూనిట్లపై పూర్తి అవగాహన కల్పించి, పూర్తి స్థాయిలో నడిపించేందుకు సిద్ధమయ్యారని కలెక్టర్, రీసోర్స్ బృందం సంతృప్తి చెందితే యూనిట్‌ను లబ్ధిదారుడికి అందించాలన్నారు. యూనిట్ల నిర్వహణలో రీసోర్స్ బృందాలు లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ తగిన సహకారం అందించాల్సి ఉంటుంది. యూనిట్లన్నీ మంజూరై పూర్తి స్థాయిలో నడిచేలా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్, రీసోర్స్ బృందాలకు ప్రభుత్వం ఆదేశించింది.

Related Posts