YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

తీన్మార్ మల్లన్న కేసులు.. హైకోర్టు ఆశ్చర్యం..

తీన్మార్ మల్లన్న కేసులు.. హైకోర్టు  ఆశ్చర్యం..

హైదరాబాద్, అక్టోబరు 7,
క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానల్ అధినేత, జర్నలిస్టు చింతపండు నవీన్‌కుమార్‌ అలియాస్‌ తీన్మార్‌ మల్లన్నపై ఒకే తరహా అభియోగాలున్నా వేర్వేరుగా అనేక కేసులు నమోదు చేయడాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. ఓ వ్యక్తిపై ఒకే విధమైన అభియోగాలు ఉన్నప్పుడు ఒక కేసులో దర్యాప్తు చేపట్టి.. మిగిలిన కేసులను స్టేట్‌మెంట్‌గా పరిగణించి మూసివేయాలని స్పష్టం చేసింది. తీన్మార్ మల్లన్న విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును న్యాయస్థానం తప్పుబట్టింది. ఈ కేసుల విచారణను డీజీపీ స్వయంగా పర్యవేక్షించాలంటూ న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌  ఆదేశాలిచ్చారు. తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలనుకున్నా, పీటీ వారెంట్‌ కింద అరెస్టు చూపించాలనుకున్నా డీకే బసు కేసులో సుప్రీంకోర్టు నిబంధనలను తప్పక పాటించాలని హైకోర్టు సూచించింది. నవీన్‌ కుమార్‌పై నమోదైన 35 కేసుల్లో 22 హైదరాబాద్‌లోనివి కాగా... 13 కేసులు ఇతర ప్రాంతాలకు చెందినవని, ఈ కేసుల్లో పీటీ వారెంట్, వారెంట్‌ జారీ అయిన సమాచారాన్ని నవీన్‌కుమార్‌కు లేదా ఆయన భార్య మత్తమ్మకు వారంలో తెలియజేయాలని ఆదేశించింది. ఆయనపై నమోదుచేసిన కేసుల్లో ఏడేళ్లకు మించి శిక్షపడే నేరాల్లేవని, ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అర్నేష్‌కుమార్‌ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు నేర విచారణ చట్టం సెక్షన్‌ 41–ఎ కింద దర్యాప్తు అధికారులు నోటీసులు జారీచేయాలని స్పష్టం చేసింది.తీన్మార్ మల్లన్నపై పోలీసులు ప్రతీకారం తీర్చుకునే తరహాలో వ్యవహరించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. మల్లన్న, ఆయన భార్యను విచారణ పేరుతో వేధింపులకు గురి చేయరాదని ఆదేశించింది. ఆయనపై కేసుల నమోదుకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దర్యాప్తు చేపట్టేలా రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్ల ఎస్‌‌హెచ్‌వోలను డీజీపీ ఆదేశించాలని హైకోర్టు పేర్కొంది.

Related Posts