పార్ధీ ముఠా జనగామలో సంచరిస్తోందా అనుమానాలు కలుగుతున్నాయి. గత ఏడాది రఘునాథపల్లి మండలంలో ఓ కుటుంబంపై విరుచుకుపడి నలుగురిని పొట్టన బెట్టుకున్న పార్ధీ ముఠా సభ్యుల కదలికలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురవుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని సాయినగర్లో ఓ యువకుడు సృష్టించిన హల్చల్తో ఒక్కసారిగా హైటెన్షన్ నెలకొంది. ఐరన్ రాడ్, కారం పొడితో ఏకంగా పోలీసులపై దాడికి పాల్పడే ప్రయత్నం చేయడంతో పార్ధీ ముఠాగా భావిస్తున్నారు. ఓ ఇంట్లోని బాత్రూంలో తలదాచుకున్న వ్యక్తిని స్థానికుల సాయంతో పోలీసులు రెండు గంటలపాటు కష్టపడి అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఇంటర్సెప్టర్ పోలీసుల వాహనం గస్తీ తిరుగుతోంది. హైదరాబాద్ హైవే.. ఓవా హోటల్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఐరన్ రాడ్తో సాయినగర్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులను గమనించిన వ్యక్తి పారిపోతూ సాయినగర్లో నివాసముంటున్న మెకానికల్ చంద్రయ్య ఇంట్లోకి దూరి, బాత్రూంలో తలదాచుకున్నాడు. వెంటనే ఇంటర్సెప్టర్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బాత్రూంలో ఉన్న వ్యక్తి లోపల గడియ పెట్టుకోవడంతో పోలీసులు శతవిధాలుగా ప్రయత్నించార.బాత్రూం లోపలి నుంచి ఐరన్ రాడ్తో పోలీసులపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. సీఐ, ఎస్సైలు రెండు కర్రల సాయంతో వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశారు. రెండు గంటల తర్వాత తలదాచుకున్న వ్యక్తి బయటకు వచ్చి పోలీసుల కళ్లలో కారం చల్లుతూ పారిపోయేందుకు యత్నించాడు. ఈ దాడిలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పారిపోతున్న వ్యక్తిని పోలీసులు ప్రాణాలకు తెగించి పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అంతా ఊపిరి పిల్చుకున్నారు.రైల్వే లైన్ ఉన్న ఏరియాలనే దొంగలు ఎంచుకుంటున్నారు. దోచుకున్న సొత్తుతో దొంగలు రైలు ఎక్కుతూ దర్జాగా పారి పోతున్నారు. పార్ధీముఠా సభ్యులు రైల్వే స్టేషన్ ఉన్న రఘునాథపల్లి మండలంలో దిగి ఓ కుటుంబాన్ని పొట్టన బెట్టుకుంది. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్ ఏరియాలో గస్తీ పెంచారు.