YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జనాలకు దూరంగా గల్లా

జనాలకు దూరంగా గల్లా

గుంటూరు, నవంబర్ 11,
ఏపీ రాజధాని అమరావతి ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. అమరావతి రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. అమరావతి నుంచి తిరుపతి వరకు సాగుతున్న యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. తొలి రోజు వందల్లో మొదలైన రైతుల పాదయాత్ర ఇప్పుడు వేల్లలోకి చేరింది. రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. హైకోర్టు న్యాయవాదులు సైతం రైతుల పాదయాత్రలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. అమరావతి ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాదయాత్రకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. కాని స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ మాత్రం కానరావడం లేదు. గతంలో అమరావతి ఉద్యమానికి మద్దతుగా పార్లమెంట్ ను గడగడలాడించిన గల్లా.. ఇప్పడు ఎక్కడున్నారో ఎవరికి తెలియడం లేదు. అమరావతి రైతుల పాదయాత్రలో ఆయన ఎందుకు పాల్గొనడం లేదన్నది చర్చగా మారింది. ఏపీలో టీడీపీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలలో గల్లా జయదేవ్‌ ఒకరు. వైసీపీ హవాలోనూ వరుసగా రెండోసారి గుంటూరు నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. విభజన హామీలపై లోక్‌సభలో ప్రధాని మోదీని మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ అని సంభోదించి పాపులారిటీ సంపాదించారు జయదేవ్‌. టీడీపీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కొంతకాలం దూకుడుగా వెళ్లిన ఆయన… ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. గుంటూరులో అడ్రస్‌ లేరు.. టీడీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. జయదేవే కాదు.. ఆయన తల్లి గల్లా అరుణకుమారి సైతం ఉలుకు లేదు పలుకు లేదు. దీంతో వారికేమైంది? ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? అనేది చర్చగా మారింది. ఇటీవల బోసడీకే అంటూ టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం సహా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయి. దాడులకు నిరసంగా చంద్రబాబు లో 36 గంటలపాటు దీక్ష చేశారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి వచ్చారు. కానీ ఎక్కడా గల్లా జయదేవ్‌  కనిపించలేదు. దాడులను ఖండిస్తూ ప్రకటన లేదు. చంద్రబాబు దీక్షకు రాలేదు. చంద్రబాబుతోపాటు ఢిల్లీ వెళ్లిన బృందంలోనూ జయదేవ్‌ లేరు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన బెజవాడ ఎంపీ కేశినేని నాని మాత్రం మనసు మార్చుకుని చంద్రబాబు దీక్షకు వచ్చారు.. మాట్లాడారు. పార్టీ అధినేతతో కలిసి ఢిల్లీ వెళ్లారు. పార్టీ మారుతారునకున్న ఎంపీ కేశినేని నాని యాక్టివ్ అయ్యారు.. మరి మరో ఎంపీ గల్లా జయదేవ్ ఎందుకు కనిపించడం లేదు, టీడీపీ కార్యక్రమాల్లోనూ ఎందుకు పాల్గొనడం లేదన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అమరరాజా సంస్థ గల్లా కుటుంబానిదే. తండ్రి రామచంద్రనాయుడు నుంచి పూర్తిస్థాయిలో వ్యాపార బాధ్యతలు స్వీకరించి అమరరాజా సీఎండీ అయ్యారు జయదేవ్‌. ఇటీవలే అమరరాజా సంస్థను సమస్యలు చుట్టుముట్టాయి. కాలుష్యాన్ని వెదజల్లుతోందని ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో పొల్యూషన్‌ బోర్డు అధికారులు వరసగా నోటీసులు జారీ చేశారు. కాలుష్యం కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లోని నీరు కలుషితం అవుతోందని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు ఆరోపణ. ఈ వివాదం సంస్థ క్లోజర్‌ నోటీసులు ఇచ్చే వరకు వెళ్లింది. దీంతో హైకోర్టు తలుపు తట్టింది అమరరాజా సంస్థ. అక్కడ ఊరట లభించింది. ఆ వివాదం అలా ఉండగానే సొంతూరు చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం దిగువమాఘంలో గల్లా కుటుంబంపై భూఆక్రమణ కేసులు నమోదయ్యాయి. తన వ్యాపార సంస్థలపై వరుసగా జరుగుతున్న  పరిణామాలు గల్లా కుటుంబాన్ని కలిచి వేసినట్టుగా చెబుతున్నారు. రాజకీయాల్లో ఉండటం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని గల్లా ఫ్యామిలీ ఫీల్ అవుతున్నట్టు సమాచారం. అందుకే యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరమైనట్టు ప్రచారం జరుగుతోంది. జయదేవ్‌ కుమారుడు గల్లా అశోక్‌ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమా ప్రమోషన్‌లో జయదేవ్‌ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. కారణం ఏదైనా తల్లి అరుణకుమారి టీడీపీ పొలిట్‌బ్యూరో నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవడం.. జయదేవ్‌ సైలెంట్‌ కావడంతో వారి రాజకీయ భవిష్యత్‌ వ్యూహం ఏంటన్నది ప్రశ్నగా మారింది. మరికొంతమంది మాత్రం ఆయన బీజేపీ గూటికి చేరుతున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి గల్లా జయదేవ్ వ్యవహారం టీడీపీకి ఇబ్బందిగా పరిణమించింది.

Related Posts