తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కొరుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు బంధు చెక్కులు , పాసు పుస్తకాల పంపిణి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. గురువారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం శాలపల్లి ఇంద్రానగర్ ఏర్పాటు చేస్తున్న రైతు బంధు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లాంచనంగా ప్రారంభించనుండటంతో నాయకులు , అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షి౦చారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా జిల్లాల నుండి దాదాపు లక్ష మంది రైతులు హజరు కానున్నారు. గురువారం ఉదయం 11:00 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు చెక్కులతో పాటు పాస్ పుస్తకాలు పంపిణి చేయనున్నారు. రైతు బంధు పథకం ద్వారా రాష్ట్రం లోని 58.34 లక్షల రైతు కుటుంబాలకు ఒక కోటి 45 లక్షల నుండి ఒకకోటి 50 లక్షల ఎకరాలకు లబ్ది చేకూరుతుంది. బ్యాంకులలో నగదు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఎండకాలం కావడంతో రైతులకు ఇబ్బందులు కలుగకుండా సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చెశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల నుండి రైతులు పార్టి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వచ్చే అవకాశం ఉండటంతో పొలీసులు ప్రత్యేక రూట్ మ్యాప్ తయారు చేసారు. సభకు వచ్చే వాహనాల పార్కింగ్ ప్రణాళికలు రూపొందించారు.