ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకుగాను జీహెచ్ఎంసీ మరో వినూత్న కార్యక్రమం బ్లాక్ బ్యాగ్ ప్రచారోద్యమాన్ని నగరవ్యాప్తంగా ప్రారంభించింది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, రీసైకిల్ చేయడాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా నగరవాసులకు అవగాహన కల్పిస్తోంది. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు 1700 మెట్రిక్ టన్నులకు పైగా మున్సిపల్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటిలో 25శాతంకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉంటున్నాయని అంచనా, నగరంలోని ఖాళీ స్థలాలతో పాటు రోడ్లకు ఇరువైపులా ప్లాస్టిక్ కవర్లు కనిపించడం సర్వసాధారణంగా మారింది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను ప్రత్యేకంగా ఏరివేసి వాటిని ప్రత్యేకంగా నల్లటి కవర్లలో ఉంచి సేకరించిన కాలనీలు, బస్తీల్లో ప్రదర్శించడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు తమ ప్రాంతంలో ఎంత పరిమాణంలో ఉపయోగిస్తున్నారనే అంశంపై చైతన్యపరిచేందుకు ఈ బ్లాక్ బ్యాగ్ ప్రచారోద్యమాన్ని చేపట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్రెడ్డి తెలియజేశారు. ఈ బ్లాక్ బ్యాగ్ ప్రచారోద్యమంలో జీహెచ్ఎంసీకి చెందిన శానిటరీ వర్కర్లు, జవాన్లతో పాటు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఇప్పటికే ఈ బ్లాక్ బ్యాగ్ ప్రచార కార్యక్రమం హయత్నగర్ సర్కిల్లోని భాగ్యలత కాలనీ, రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవులపల్లి వార్డు, సరూర్నగర్ సర్కిల్లోని ఇందిరానగర్లలో స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు నిర్వహించారు. భాగ్యలత కాలనీలో దాదాపు 82 బ్యాగ్లలో 492కిలోల ప్లాస్టిక్ను సేకరించగా మైలార్దేవులపల్లిలో ససేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒకొక్క శానిటరీ వర్కర్ రూ. 150 నుండి రూ. 350 వరకు అదనపు ఆదాయం పొందారు.