YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జూనియర్ చుట్టూ ఏపీ రాజకీయాలు

జూనియర్ చుట్టూ ఏపీ రాజకీయాలు

హైదరాబాద్, డిసెంబర్ 4,
పీ రాజకీయాల్లో కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. ఇటీవల చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు తీవ్రంగా ఆరోపించగా… నందమూరి కుటుంబసభ్యులు కూడా ఈ అంశంపై స్పందించారు. అయితే హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పందన తమకు నచ్చలేదని కొందరు టీడీపీ సీనియర్ నేతలు బాహాటంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీఆర్ అభిమానులు నిరసన వ్యక్తం చేసిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.మరోవైపు అధికార పార్టీ వైసీపీలోనూ జూనియర్ ఎన్టీఆర్ నామస్మరణ నడుస్తోంది. ఏపీలో టీడీపీ మళ్లీ పుంజుకోవాలంటే పార్టీ పగ్గాలను నందమూరి కుటుంబసభ్యులకు అప్పగించాలని గురువారం నాడు మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి గట్టిగా డిమాండ్ చేశారు. అయితే టీడీపీ పగ్గాలను జూనియర్ ఎన్టీఆర్ తీసుకోవాలని బాలినేని ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎందుకంటే నందమూరి కుటుంబం నుంచి ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నది బాలయ్య మాత్రమే. 2014, 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలయ్య ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా టీడీపీ కార్యక్రమాల్లో మాత్రం బాలయ్య అంతంతమాత్రంగానే పాల్గొంటున్నారు. ఆయన ఎక్కువగా సినిమాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో బాలయ్య కాకుండా టీడీపీకి ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం ఎన్టీఆర్ మాత్రమే. అతడు పార్టీకి భవిష్యత్ ఆశాకిరణం అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నేతలు గతంలో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా టీడీపీని జూనియర్ ఎన్టీఆర్‌కే అప్పగించాలని పరోక్షంగా సూచిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ అభిమానుల్లో చంద్రబాబు, లోకేష్‌కు వ్యతిరేకంగా ముద్ర వేయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే తాము ఎన్టీఆర్ కుటుంబానికి అండగా ఉన్నట్లు కనిపించాలని వైసీపీ నేతలు తాపత్రయపడుతున్నట్లు కనిపిస్తోంది.కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల నిరసనలు, ఆందోళనల వెనుక కూడా వైసీపీ నేతలే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కుప్పం టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డా. చంద్రబాబు అడ్డాలోనే టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తుందని ప్రచారం చేస్తే… తమకు రాజకీయంగా ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారని.. అందుకే ఏపీలో ఎక్కడా కనిపించని ఎన్టీఆర్ అభిమానుల హడావిడి ఇటీవల కుప్పంలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ఎప్పుడు కుప్పంలో పర్యటించినా ఎన్టీఆర్ అభిమానులు.. ఎన్టీఆర్ సీఎం అనే ఫ్లెక్సీలతో దర్శనమిస్తున్నారని.. ఇది రాజకీయ ఎత్తుగడ అని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారన్న విషయం ఆయన అంతర్గత వ్యవహారం. ఈ విషయంలో అభిమానులు చెప్పినా.. వైసీపీ నేతలు చెప్పినా… ఎన్టీఆర్ మనసులో ఏముందో ఆ పరమేశ్వరుడికే తెలియాలి.

Related Posts