YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీలో కోవర్టుల రచ్చ

టీడీపీలో కోవర్టుల రచ్చ

విజయవాడ, డిసెంబర్ 13,
తెలుగుదేశం పార్టీలో కోవర్టులున్నారా? పార్టీలో ఉంటూ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు కోవర్టులున్న విషయాన్ని స్వయంగా చెప్పడంతో మరోసారి పార్టీలో చర్చ జరుగుతుంది. కోవర్టుల విషయంలో ఇక ఉపేక్షించబోనని చంద్రబాబు జారీ చేసిన హెచ్చరికలు ఎవరిని ఉద్దేశించినవన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ సంధికాలంలో ఉంది.తెలుగుదేశం పార్టీలో కుక్కమూతి పిందెలున్నారని చంద్రబాబు స్వయంగా అంగీకరించారు. ఇది తేలిగ్గా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. పార్టీ ఓటమి పాలయిన రెండున్నరేళ్ల తర్వాత చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి 175 నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. గత ఎన్నికల్లో ఓడిపోతే ఓడిపోయి ఉండవచ్చు. కానీ నలభై శాతం ఓట్లను సాధించిందన్న విషయాన్ని విస్మరించకూడదు.కానీ తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత అనేక మంది నేతలు వైసీపీకి అనుకూలంగా మారారని తెలుస్తోంది. దాదాపు 70 నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉన్నట్లు చంద్రబాబుకు నివేదికలు అందాయి. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కూడా కోవర్టులే కారణమని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో ఇప్పటి వరకూ నియోజకవర్గాల ఇన్ ఛార్జులుగా ఉన్న వారి పనితీరును పరిశీలించిన చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడి నేతలు కావాలని ప్రజాదరణ లేని నేతలు అభ్యర్థులుగా ప్రకటించడంతోనే అక్కడ జీరో రిజల్ట్ వచ్చాయని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. కేసులకు భయపడి కొందరు. ప్రలోభాలకు మరికొందరు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారందరినీ ఏరివేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. మరి చంద్రబాబు ఎవరిపైన చర్యలు తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
నెల్లూరులో వాళ్లపై చర్యలా
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇద్దరు సీనియర్ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ ఓటమికి వారిని బాధ్యులను చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బాగానే ఉంది. చంద్రబాబు నిర్ణయం కరెక్టే. కానీ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర ఓటమికి ఈ చిన్న స్థాయి నేతలే కారణమా? అన్న చర్చ జరుగుతుంది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన వారిని ఎవరినైనా సస్పెండ్ చేయాల్సిందే.కానీ చంద్రబాబు చేసిందేమిటి? అసలు కారకులను వదిలేసి చిన్న నేతలను బలిచేస్తే ప్రయోజనం ఉంటుందా? నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కు ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 54 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు ఘోరంగా ఓటమి పాలయ్యారు. జీరో రిజల్ట్ వచ్చింది. ఇది దిగ్భ్రాంతి కరమైన విషయం. టీడీపీ జిల్లాలో బలంగా లేదా? అంటే ఎవరూ దానిని అంగీకరించరు. నెల్లూరు జిల్లాలో తొలి నుంచి టీడీపీ సత్తా చాటుతూనే వస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలను గెలవలేకపోయినా, ఒక్క డివిజన్ ను దక్కించుకోలేని హీనస్థితిలో ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  నెల్లూరు జిల్లాలో టీడీపీకి హేమాహేమీలు ఉన్నారు. సుదీర్ఘకాలంగా పార్టీకి అన్ని విధాలుగా అండగా ఉన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ వంటి నేతలున్నారు. ఎన్నికలకు ముందు బాధ్యతలను వీరికే చంద్రబాబు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక కూడా వీరి కనుసన్నల్లోనే జరిగింది. చివరి నిమిషం వరకూ అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయారు. ఎవరు కారణం? వీరితో పాటు సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, నిమ్మకాలయ చినరాజప్ప, అచ్చెన్నాయుడు వంటి వారు కూడా నెల్లూరు కార్పొరేషన్ పై దృష్టి పెట్టారు. కానీ సీనియర్ నేతలు ఈ ఓటమికి కారణం కాదని చంద్రబాబు తేల్చేసినట్లయింది. గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వేలూరి రంగారావులను సస్పెండ్ చేశారు. ద్వితీయ శ్రేణి నేతలను బాధ్యులను చేసి అసలు కారకులను వదిలేయడం చర్చనీయాంశమైంది.

Related Posts