మన జాతీయ పతాకం సమగ్రత, సమైక్యతలకి సూచికగా నిలుస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. నాయకులు జాతీయ సమైక్యతను మరచిపోయినా యువత , విద్యార్థులు ఆ దిశగా ప్రతిజ్ఞ తీసుకుంటుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద భారత జాతీయ పతాకాన్ని గురువారం హైదరాబాద్ లో అయన ఆవిష్కరించారు. ఎన్టీఆర్ స్టేడియంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ ఈ జెండాను రూపొందించింది. ఈ పతాకం 122 అడుగుల పొడవు, 183 అడుగుల వెడల్పుతో ( 22,326 చదరపు అడుగుల విస్తీర్ణం) ఉంది. ఈ భారీ జాతీయ పతాకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. తొలి స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలో యువత, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ "ఈ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, అశోక చక్రం.. ఇవన్నీ మన జాతి సమగ్రతకి, జాతీయ సమైక్యతకు నిదర్శనం. సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పినట్లు మన జాతీయ జెండా ఏ కులానిదీ, పార్టీది, మతానిది కాదు. ప్రతి ఒక్కరిదీ. కాషాయం అంటే హిందూ మతానికి సూచిక కాదు. ఆ రంగు మన రాజకీయ వ్యవస్థ, నాయకులు ఎలా ఉండాలో చెబుతుంది. కాషాయం కట్టినవాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా, స్వలాభం లేకుండా ఉంటారు. నాయకులూ అలాగే ఉండాలి. మన జెండా దేశం కోసం త్యాగాలు చేసినవారిని, స్వలాభం లేకుండా పని చేస్తారో గుర్తు చేస్తుంది. యువత ముందుకు వచ్చి ఈ వేడుకను నిర్వహించడం ఆనందంగా ఉంది. మీ ఔన్నత్యాన్ని తెలియచేస్తోంది" అన్నారు. ఈ సందర్భంగా ఈ వేడుకకు హాజరైన వారితో జాతీయ సమైక్యత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో వైబ్రెంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ వ్యవస్థాపకుడు విజయ్ కలామ్ పాల్గొన్నారు.