YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లోకేష్... ఏం చేస్తున్నాడో... అర్ధమౌతోందా

లోకేష్... ఏం చేస్తున్నాడో... అర్ధమౌతోందా

గుంటూరు, డిసెంబర్ 18,
తారాజకీయం హుందాగా సాగాలి. నేరుగా పాలిటిక్స్ లోకి వచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా నేర్చుకోకపోతే ఎలా? ప్రత్యర్థులకు అస్త్రాలు దొరికే పనిచేస్తారా? ఇవీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సొంత పార్టీ నుంచి విన్పిస్తున్న కామెంట్స్. అసలు రాష్ట్ర రాజకీయాలు లోకేష్ కు అర్థమవుతున్నాయా? అన్న ప్రశ్న కూడా విన్పిస్తుంది. పిల్ల చేష్టలు కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. లోకేష్ జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తండ్రి కష్పపడుతుంటే? ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. చంద్రబాబు పార్టీని పైకి లేపడానికి కిందా మీదా పడుతున్నారు. ఏ చిన్న అవకాశమొచ్చినా చంద్రబాబు తన రాజకీయ చతురతను ఉపయోగించి పార్టీకి ఒక్కొక్క ప్లస్ ను చేర్చుకుంటూ వెళుతున్నారు. చివరకు బోరు మని ఏడ్చి కొంత మార్కులు కొట్టేశారు కూడా. కానీ ఆయన తనయుడు నారా లోకేష్ కు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. తన ధోరణి తనదేనన్న రీతిలో ఉన్నారు. ఎన్నిలకకు ఇంకా మూడేళ్లు సమయం ఉంది. ఏపీలో ఇంకా పొత్తులు కుదరలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తుందన్న ప్రచారమయితే జోరుగా సాగుతుంది. కానీ పవన్ కల్యాణ్ ను నమ్మడానికి లేదు. చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినా ఇస్తారు. బీజేపీ గట్టిగా పట్టుబడితే పవన్ ఎటువైపు మొగ్గు చూపుతారన్నది చివరి వరకూ చెప్పడం కష్టమే. అయితే లోకేష్ అత్యుత్సాహం చూపిస్తున్నారని, జనసేన పార్టీ ఆఫీస్ కు వెళ్లడం క్యాడర్ ను అయోమయంలో పడేసినట్లేనని అంటున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు ఉంటే తమకు సీటు దక్కదన్న ఆందోళన అనేక మంది నేతల్లో వ్యక్తమవుతుంది. వీరు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ఖర్చు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. ప్రధానంగా తూర్పు, పశ్చిమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలో ఈ పరిస్థితి ఉంది. లోకేష్ నిర్వాకంతో వీరిలో మరింత భయం మొదలవుతుంది. అయినా పొత్తుల విషయం చంద్రబాబు చివరలో తేలుస్తారు. ముందుగానే జనసేన పార్టీ కార్యాలయాలకు వెళ్లి లోకేష్ లేనిపోని తలనొప్పులు తెచ్చి పెట్టారంటున్నారు.
ఇక మళ్లీ హామీలు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో మంగళగిరిలోనే పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. ఆయన ఈసారి తన గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఇటీవల మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతున్నారు. ఈరోజు కూడా మంగళగిరిలో ఆయన పర్యటించారు. అయితే అక్కడ టీడీపీకి ప్రధాన నేతగా ఉన్న గంజి చిరంజీవికి లోకేష్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది. మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకూ గెలుపు సాధించలేదు. 1985లో ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు మంగళగిరి నుంచి గెలిచారు. అదే టీడీపీికి మంగళగిరిలో చివరి గెలుపు. మూడున్నర దశాబ్దం నుంచి మంగళగిరిలో టీడీపీ జెండా ఎగురలేదు. ఇక్కడ పద్మశాలీలు ఎక్కువగా ఉంటారు. అదే సామాజికవర్గానికి చెందిన గంజి చిరంజీవికి 2014 ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చినా గెలవలేదు. 2019 ఎన్నికల్లో స్వయంగా లోకేష్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి గంజి చిరంజీవిని చీరాల నియోజకవర్గానికి పంపాలన్న నిర్ణయానికి లోకేష్ వచ్చినట్లు తెలిసింది. చీరాల అయితే.... ఈ మేరకు గంజి చిరంజీవికి లోకేష్ హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. గంజి చిరంజీవి పద్మశాలి సామాజికవర్గం నేత. ఆయన సతీమణిది కాపు సామాజికవర్గం. ఈ కాంబినేషన్ చీరాలలో వర్క్ అవుట్ అవుతుందని లోకేష్ భావిస్తున్నారు. గతంలోనూ పోతుల సునీతను చీరాలకు పంపినా ప్రయోజనం లేదు. అయితే ఈసారి గంజి చిరంజీవిని చీరాలకు పంపితే అక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని పార్టీ అధినాయకత్వం భావిస్తుంది. ఇక్కడ లోకేష్ కు కూడా గంజి చిరంజీవి సామాజికవర్గం అండగా నిలుస్తుంది. చీరాలలో పద్మశాలిలు, కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకు ఎక్కువ. అక్కడ గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించిన కరణం బలరాం వైసీపీ మద్దతుదారుగా మారిపోయారు. అక్కడ ఈసారి వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే గంజి చిరంజీవిని చీరాలకు పంపి తాను మంగళగిరిలో మరోసారి పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని లోకేష్ డిసైడ్ అయ్యారు.

Related Posts