తెలంగాణను మాగాణిగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే అన్ని సీజన్లలోనూ సాగునీటికి కొరత రాకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం సైతం పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రతి జిల్లానూ వ్యవసాయోత్పత్తికి అనుకూల ప్రాంతంగా మలచాలన్నది సర్కార్ టార్గెట్. ఈ లక్ష్య సాధనకు ముందడుగు అన్నట్లు అన్ని జిల్లాల్లోనూ జలవనరుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తోంది. నీటి ప్రాజెక్టులు నిర్మిస్తోంది. పథకాల నిర్మాణం వేగవంతం చేసి సాగు నీటి కొరతను పూర్తిగా నివారించేందుకు చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ చొరవ ఫలితంగానే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నాలుగు ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. దీనికి తోడు గతనెలలోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తైతే ప్రాంతీయంగా సాగునీటికి కొరత అదుపులోనే ఉంటుందని, రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని అధికార యంత్రాంగం చెప్తోంది. అందుకే వీటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ పథకాలను అందుబాటులోకి తెచ్చి ఖరీఫ్లోనే 8.95 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నారు.
కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.65 లక్షల ఎకరాలకు, భీమా ద్వార 2 లక్షల ఎకరాలకు నీరు సరఫరా చేయాలని అధికారులు ఇదివరకే నిర్ణయించారు. నెట్టెంపాడు ద్వార 2 లక్షల ఎకరాలకు, కోయిల్సాగర్ ద్వార 55 వేల ఎకరాలకు సాగునీటిని అందించాలనుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్డీఎస్ ప్రాజెక్టు ఆయకట్టులో నీళ్లందని 55వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టారు. ఈ పథకాన్ని జూన్ చివరి నాటికే పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని భావిస్తున్నారు. నెట్టెంపాడు పనుల్లో కొంత జాప్యం జరుగుతోందని స్థానిక రైతులు కొంతకాలంగా విమర్శిస్తున్నారు. దీంతో పనులను వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదిలాఉంటే నిరంతర విద్యుత్ అందుబాటులోకి రావడంతో రైతాంగానికి నీటి వినియోగం ఎక్కువైంది. మరోవైపు భూగర్భ జలాలు పాతాళానికి చేరుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టించి నీటిని సద్వినియోగం చేసుకోవాలని వృధా చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఈ దఫా వర్షపాతం అధికంగా ఉంటుందని వాతావరణ విభాగం స్పష్టం చేస్తోంది. దీంతో వర్షపునీటిని ఒడిసిపట్టేలా అంతా ఇప్పట్నుంచే కార్యాచరణ సిద్ధం చేసుకుని అనుసరించాలని అంటున్నారు. ఈ అంశంలో ప్రజలంతా భాగం పంచుకోవాలని స్పష్టంచేస్తున్నారు.