YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కు రేవంత్ లెటర్

కేసీఆర్ కు రేవంత్ లెటర్

హైదరాబాద్, డిసెంబర్ 29,
ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోస్టింగ్ లలో స్థానికతను పరిగణనలోకి తీసుకోకపోవడం గురించి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలు ఉద్యోగులు, ఉపాధ్యాయులను మనో వేదనకు గురి చేస్తున్నాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలలో స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలని లేఖలో కోరారు. ఇంకా ఆయన ఈ లేఖలో రాష్ట్రంలో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, బదిలీల కోసం ప్రభుత్వం డిసెంబర్ 6న జీవో నెంబర్ 317ను జారీ చేసింది. ప్రభుత్వంలోని 63 శాఖల్లో సుమారు నాలుగున్నర లక్షలమంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో రెండున్నర లక్షలమంది ఉద్యోగుల విభజన, బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. తెలంగాణలో కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టుల విభజన కొందరికీ వరంగా, మరికొందరికి శాపంగా మారింది. ఉద్యోగుల విభజన, బదిలీల్లో కొత్తజిల్లాల వారీగా స్థానికతను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఉమ్మడి జిల్లా యూనిట్‌గా సినియార్టీనే ప్రాతిపదికగా తీసుకుని సీనియర్లకు వారి ఆప్షన్ మేరకు పోస్టింగ్ లు ఇస్తున్నారు. జూనియర్లకు మాత్రం వారి స్థానికతకు భిన్నంగా ఇతర జిల్లాలకు అందునా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు.దీంతో దాదాపు 20-30 ఏళ్లు స్థానికేతరులుగా జీవించాల్సిన పరిస్థితి. అంతేకాకుండా సీనియర్లు రిటైర్ అయితే ఆ స్థానాల్లో స్థానికేతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులకు తిరిగి అవకాశం కల్పిస్తామనే మాట కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. ప్రస్తుత విధానంలో అత్యంత ప్రభావితమవుతున్న వారు భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు. ఇతర ఉద్యోగులతో పోల్చితే ఉపాధ్యాయుల కేటగిరి భిన్నమైంది. ఉపాధ్యాయులది జిల్లా కేడర్. తాము ఉద్యోగం చేస్తున్న ప్రాంతంలో లేదా సమీపంలో ఇళ్లు నిర్మించుకొని స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటారు. బదిలీల కారణంగా సొంత జిల్లాను ఉన్న పళంగా వదిలి వెళ్లాల్సిన పరిస్థితి. విద్యా వాలంటీర్ల అవసరం లేకుండా మారుమూల ప్రాంతాలకు జూనియర్ ఉపాధ్యాయులను బదిలీ చేస్తున్నారు. మరో వైపు ఖాళీ పోస్టులు ఉన్న పాఠశాలలను మూసివే యడానికి హేతుబద్దీకరణ విధానాన్ని ప్రభుత్వం బదిలీలో రూపంలో దొడ్డిదారిన తీసుకొస్తుందనే అనుమానం కూడా కలుగుతుంది.సాధారణంగా కౌన్సెలింగ్ టైమ్‌‌లో జిల్లాలో మొత్తం ఆ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో చూపించి, తర్వాత ఆప్షన్లు తీసుకుంటారు. ప్రస్తుతం జిల్లా నుంచి ఎంత మంది వెళ్లిపోయారో ఆ పోస్టులనూ ఖాళీలుగా చూపించడం లేదు. కొత్తగా జిల్లాకు ఎంత మంది అలాట్ అయ్యారో, ఆ సంఖ్య మాత్రమే ఖాళీలుగా చూపిస్తున్నారు. సీనియారిటీ ఆధారంగా శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను, ఉపాధ్యాయులను సర్దుబాటు చేసే విధంగా విడుదల చేసిన జీవో 317ని ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని కోరారు. సీనియర్ ఎంప్లాయీస్ అర్బన్ జిల్లాలను ఎంచుకుంటుండగా, జూనియర్ ఉద్యోగులు రూరల్ జిల్లాలకు అలాట్ అవుతున్నారు. మూడేండ్లలో రిటైర్మెంట్ జరిగి ఖాళీలు ఏర్పడితే.. జూనియర్ ఉద్యోగులు అలాట్ అయిన జిల్లాల్లో ఇంకో 30 ఏండ్ల వరకు ఖాళీలు ఏర్పడే ఛాన్స్ ఉండదు. దీంతో ఆయా జిల్లాల నిరుద్యోగులకు నష్టం జరిగే ప్రమాదముంది.జిల్లా కేడర్ మొత్తం ఉద్యోగుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 50 ఏండ్ల పైబడిన వారు 60 వేల పైచిలుకు ఉంటారని అంచనా. ఫలితంగా దాదాపు 60 వేల ఉద్యోగాలను గ్రామీణ నిరుద్యోగులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జోనల్‌ విధానంలో ఉద్యోగుల బదిలీలను అటు నుంచి ఇటు సర్దుబాటు చేస్తున్నారే తప్ప, కొత్త పోస్టుల మంజూరును ప్రస్తావించకుండా పాత వారితోనే పాలన సాగించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఇది కూడా ఒక రకంగా నిరుద్యోగులను నష్ట పరిచే చర్యగా రేవంత్‌రెడ్డి లేఖలో ప్రస్తావించారు.ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గదర్శకాలను రద్దు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలతో చర్చించిన తర్వాత రూపొందించే నూతన గైడ్ లైన్స్ ఆధారంగా బదిలీలు చేపట్టాలి.ఏజెన్సీ ప్రాంతాల్లో ఉద్యోగుల కేటాయింపు, బదిలీలు ఇప్పటి వరకు జీవో నెంబర్ 3 ప్రకారమే జరిగాయి. ప్రస్తుతం కూడా జీవో నెంబర్ 3 ఆధారంగానే బదిలీలు చేపట్టాలి. ఉద్యోగుల కేటాయింపులో స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలి. భవిష్యత్లో ఏర్పడే ఖాళీలలో ఇతర జిల్లాలకు బదిలీ అయిన ఉద్యోగులకు అవకాశం ఇవ్వాలి.అవసరమైతే జూనియర్ల కోసం సూపర్ న్యూమరీ పోస్టులను సృష్టించాలి. ఉపాధ్యాయుల కేటాయింపునకు కౌన్సిలింగ్ విధానాన్ని అనుసరించాలి. బదీలీల సమయంలో ప్రతి జిల్లాలో ఉన్న ఖాళీలను చూపించాలని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Related Posts