YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీ పార్టీలో ముసలం

గులాబీ పార్టీలో ముసలం

ఖమ్మం డిసెంబర్ 30,
ఖమ్మం జిల్లాలోని గులాబీ పార్టీలో ముసలం నెలకొంది. జిల్లాతోపాటు పాలేరులో రాజకీయం నిత్యం చర్చనీయాంశంగా మారుతోంది. నియోజకవర్గంలో మాజీ మంత్రి తుమ్మల వర్సెస్ కందాల ఎపిసోడ్‌ రోజురోజుకీ హీటెక్కుతోంది. వర్గపోరు మరింత ముదిరింది. పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. పాలేరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు. అటు మరింత దూకుడుగా వెళ్తున్నారు ఎమ్మెల్యే కాందాల ఉపేందర్‌రెడ్డి. ఒకరిపై ఒకరు పరోక్షంగా కౌంటర్లు వేసుకుంటున్నారు. దీంతో కిందిస్థాయి కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. 2018 వరకు పరిస్థితి బాగానే ఉంది. అంతా తుమ్మల కనుసన్నల్లోనే జరిగేది. ఆ తర్వాతే సీన్‌ రివర్స్ అయింది. 2018 ఎలక్షన్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో తుమ్మల ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కందాల గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.. అదిగో అప్పటి నుంచే మొదలైంది అసలు వార్. అప్పటికే కత్తులు దూసుకుంటున్న రెండు వర్గాల మధ్య రైతు సమన్వయ కమిటీలు చిచ్చురేపాయి.. తుమ్మల అనుచరులను తొలగించడంతో గొడవలు తారస్థాయికి చేరాయి.ఈ మధ్య ఫ్లెక్సీ వార్‌ కూడా అగ్గిరాజేసింది. ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ప్రోటోకాల్ పాటించలేదని తుమ్మల వర్గం అగ్గిమీద గుగ్గిలం అయింది. అటు ఫ్లెక్సీని చించారంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది కందాల వర్గం. ఇలా సై అంటే సై అంటున్నాయి ఇరు వర్గాలు. అటు పాలేరులో విస్తృతంగా పర్యటిస్తున్నారు తుమ్మల. ప్రజలు, కార్యకర్తలకు ఎప్పడూ అండగా ఉంటానని చెప్పారు.మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ సైతం స్పీడ్‌ పెంచారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పాలేరు టికెట్ దక్కించుకునేందుకు తుమ్మల ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. సీఎం కేసీఆర్‌కు తుమ్మల అత్యంత సన్నిహితుడిగా ఉండటం.. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసి వచ్చే అంశం. మరి సీఎం కేసీఆర్ ఈ ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరం. ప్రస్తుతానికైతే..అటు తుమ్మల, ఇటు కందాల ఎవరూ తగ్గడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం జరగడం ఖాయమన్న టాక్ నడుస్తోంది.
క్రాస్ ఓటింగ్ పై మల్లా గుల్లాలు
ఖమ్మం గుమ్మంలో లొల్లి. గులాబీదళంలో గలాట. సగానికిపైగా నియోజకవర్గాల్లో గ్రూప్‌వార్. 2018లో ఇదే వర్గపోరు పార్టీని ఘోరంగా దెబ్బతీసింది. మూడేళ్ల తర్వాత కూడా సేమ్‌ సిట్యుయేషన్ కనిపిస్తోంది. పరిస్థితి ఇప్పటికీ మారలేదు. పద్ధతులూ కూడా మారలేదు. ఇటీవలి ఎమ్మెల్సీ  ఎన్నికల్లో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. క్రాస్‌ఓటింగ్ జరిగింది. సీఎం కేసీఆర్ కూడా ఈ ఇష్యూపై సీరియస్ అయ్యారు. ఆ ఇంటి దొంగలెవరో తేల్చాలన్నారు. ఇంతకీ ఖమ్మం టీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది? అందరిదీ ఒకే మాట..! పార్టీలో కుట్ర జరుగుతోంది.! గ్రూప్‌ రాజకీయాలు నడుస్తున్నాయి.! ఒకచోట ఉండి మరోచోట కాపురం చేస్తే ఎలా? ఏడేళ్లుగా ఇదే చెబుతున్నారు. పార్టీలో ఏదో జరుగుతోందంటున్నారు.! ఇప్పటికైనా కలిసికట్టుగా నడవాలి అంటున్నారు. అంతే మ్యాటర్ అక్కడే ఆగిపోతోంది. అడుగు ముందుకు పడటం లేదు.. ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ సేమ్‌ సీన్. అవే విబేధాలు, అదే వర్గపోరు. ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. పార్టీ పరువుని బజారుకీడుస్తున్నారు.. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఇప్పుడు బహిర్గతమవుతోంది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. వాస్తవానికి భారీ మెజారిటీతో గెలవాలని టీఆర్ఎస్ స్కెచ్ వేసింది. గోవాలో క్యాంపులు కూడా నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ బలం 116.. కానీ 240కిపైగా ఓట్లు రావడంతో టీఆర్ఎస్ ఒక్కసారిగా షాక్‌ తింది. పార్టీ అభ్యర్థి తాతా మధు గెలిచినా.. క్రాస్‌ ఓటింగ్‌ మాత్రం మింగుడుపడని అంశంగా మారింది.క్రాస్ ఓటింగ్ జరగడానికి కారణాలు ఏంటి? ఏయే నియోజకవర్గాల నుంచి ఎక్కువగా జరిగింది? అన్న ఇన్ఫోను నిఘా వర్గాల నుంచి తెప్పించుకుంది పార్టీ హైకమాండ్. వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట నుంచే క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూని  కేసీఆర్ సీరియస్‌గా పరిగణిస్తున్నారు.ఇందుకు సహకరించిన ఎమ్మెల్యేలు ఎవరు? వారిని నడిపించిన నాయకుడు ఎవరు అన్నది ఆరా తీశారు. ఇప్పటికే పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజా ప్రతినిధిపై ఫిర్యాదులు వెళ్లాయి. మరి హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఇటీవల టీఆర్ఎస్ నేతలు చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా జిల్లాలో ఇప్పుడు హాట్‌టాఫిక్‌గా మారాయి. ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్స్ అన్న చర్చ జోరుగా సాగుతోంది.ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కట్టప్పల భయం ఎక్కువైంది. ఎప్పుడు ఎవరు ఎటు నుంచి వెన్నుపోటు పొడుస్తారో తెలియని పరిస్థితి. 2018లోనూ ఇలాంటి వెన్నుపోట్లే పార్టీ కొంప ముంచాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే.. చావుతప్పికన్నులొట్టబోయినట్లు ఒకే ఒక్క సీటు గెలిచింది.ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ మాత్రమే గెలిచారు. మిగిలిన తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ ఘోర ఓటమి చవిచూసింది. ఆ తర్వాత నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక స్వతంత్ర్య అభ్యర్థి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. అంటే ఒక్క చోటే గెలిచినా ఇప్పుడు పార్టీ బలం మాత్రం 8కి చేరింది. ఇదిగో ఇక్కడే వస్తోంది అసలు సమస్య.ఎవరూ బయటపడకపోయినా.. బహిరంగంగా చెప్పకపోయినా అందరి వేళ్లూ ఒకరివైపే వెళ్తున్నాయి..గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు, కొత్తగూడెం, వైరా నియోజకవర్గాల్లో టీఆర్ఎస్  పరాభవానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమంటూ ఓడిపోయిన అభ్యర్థులు ఇప్పటికే హైకమాండ్‌కు కంప్లైంట్ చేశారు. 2014లో ఖమ్మం నుంచి వైకాపా  ఎంపీ గా గెలిచారు పొంగులేటి శ్రీనివాస్.ఆ తర్వాత గులాబీ కండువ కప్పుకున్నారు. 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పొంగులేటికి కాకుండా అనూహ్యంగా నామా నాగేశ్వరరావుకు టికెట్ ఇచ్చింది టీఆర్ఎస్. పొంగులేటికి రాజ్యసభ సీటు కూడా దక్కలేదు. అప్పటి నుంచి జిల్లాలో పర్యటిస్తూ.. తనకంటూ పొంగులేటి ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పరచుకున్నాడన్న టాక్‌ వినిపిస్తోంది. మరి ఇంతా జరుగుతున్నా హైకమాండ్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోందన్నది సస్పెన్స్‌గా మారింది.

Related Posts