YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సంజయ్‌ విడుదలకు హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు... ప్రభుత్వానికి నోటీసులు జారీ

సంజయ్‌ విడుదలకు హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు...   ప్రభుత్వానికి నోటీసులు జారీ

హైదరాబాద్ జనవరి 5
హైదరాబాద్‌: బీజీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. బండి సంజయ్‌ జుడిషియల్ రిమాండ్‌పై స్టే విధించిన హైకోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేస్తూ బుధవారం మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రూ.40 వేల వ్యక్తిగత పూచికత్తుతో విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కాగా తనపై దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌ను క్వాష్ చేయాలని బండి సంజయ్‌పై తరపు న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌ రెడ్డి హైకోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. బండి సంజయ్‌పై అక్రమ కేసులు, సెక్షన్స్ నమోదు చేశారని కోర్టుకు తెలిపారు. ఇదంతా ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగా బండి సంజయ్‌పై తప్పుడు కేసులు నమోదు చేసిందని కోర్టుకు విన్నవించారు. బండి సంజయ్‌ మేజిస్ట్రేట్ జ్యూడిషల్ కస్టడీ 15 రోజులు చట్టం ప్రకారం సరైంది కాదని దేశాయ్ ప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు. దేశాయ్‌ వాదనలు విన్న హైకోర్టు.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రీమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదని పేర్కొంది. అరెస్టు చేసిన 15 నిమిషాల్లోనే ఎఫ్‌ఐఆర్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించింది. ఎఫ్‌ఐఆర్‌లో సెక్షన్ 333 అదనంగా ఎందుకు చేర్చారని పోలీసులను ప్రశ్నించింది. పోలీసుల తీరును తప్పుపట్టిన హైకోర్టు.. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 17వ తారీఖు వరకు రిమాండ్ ఇవ్వడం అనేది సరైనది కాదంటూ.. తదుపరి విచారణను ఈనెల 7కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా..  ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను సవరించాలంటూ  బండి సంజయ్‌ కరీంనగర్‌లో జాగరణ దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే. కోవిడ్‌ నేపథ్యంలో దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఎంపీ సంజయ్‌ దీక్షను భగ్నం చేసి లాఠీఛార్జీలు, తోపులాటల మధ్య అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు కరీంనగర్‌ పోలీసులు తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ బండి సంజయ్‌ మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.

Related Posts