YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర హూజూరాబాద్ గా నర్సాపురం

ఆంధ్ర హూజూరాబాద్ గా నర్సాపురం

ఏలూరు, జనవరి 11,
తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చి వేసింది. అధికార తెరాస ఆత్మ రక్షణలో పడింది. చివరకు నిన్న మొన్నటి వరకు గడ్డిపోచ కన్నా హీనంగా చూసిన వామపక్షాలను శరణు వేడే స్థితికి అధికార పార్టీ అహంకారం దిగి వచ్చింది.  మండలి ఎన్నికల్లో, పార్టీ నాయకత్వాన్ని ధిక్కరించి, స్వతంత్ర అభ్యర్దిగా బరిలో దిగిన మాజీ మేయర్ రవీందర్ సింగ్  ను స్వయంగా ముఖ్యమంత్రి బుజ్జగించి వెనక్కి తెచ్చుకున్నారు. అందుకే హుజూరాబాద్ ఎఫెక్ట్ కు ఇంతకంటే వేరే ఉదాహరణ అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే జరగబోతోందా, అంటే, అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడ హుజూరాబాద్ అయితే, అక్కడ నరసాపురం. ఇక్కడ ఈటల రాజేందర్ అయితే అక్కడ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇక్కడ రెబెల్ ఎమ్మెల్ల్యే అయితే అక్కడ రెబెల్ ఎంపీ మిగిలినదంతా సేమ్ టూ సేమ్ అంటున్నారు.  ఇంచుమించుగా రెండేళ్లకు పైగా, అధికార పార్టీని ప్రతి రోజూ ‘రచ్చ బండ’ కు ఈడుస్తున్న నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఇప్పుడు సొంత పార్టీఫై ప్రత్యక్ష యుద్ధాన్ని ప్రకటించారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డితో  తాడోపేడో తేల్చుకునేందుకు ఆయన సిద్దమయ్యారు. అంతే కాదు అదేదో సినిమాలో బాలయ్య బాబు  స్పాట్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, అంటూ సవాలు విసిరిన స్టైల్లో, తనపైన అనర్హత వేటు వేయించటానికి ఎంత సమయం కావాలో చెప్పాలంటూ అధికార పార్టీకి రెబల్ ఎంపీ సవాలు విసిరారు .అందుకు ఆయనే వైసీపీ నాయకత్వానికి వారం రోజులు గడువిచ్చారు. అప్పటికీ మీతో కాకపోతే, నేనే రాజీనామా చేస్తా... ఉపఎన్నికల్లో అదే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తా .. అని ప్రకటించారు. అందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. రెండు సంవత్సరాల తర్వాత, పండక్కి సొంత నియోజకవర్గానికి వస్తున్న ఆయన అక్కడి నుంచే రాజీనానామ లేఖను లోక్ సభ స్పీకర్ కు పంపేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ నాయకులు  ఆయన విసిరిన సవాలును స్వీకరించలేదు. రఘురామ కృష్ణం రాజును తాము అంత  సీరియస్ గా తీసుకోవడం లేదని తమ అసమర్ధతను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనరాయణ డొల్లతనం బయట పెట్టుకున్నారు.   అదలా ఉంటే, రఘురామకృష్ణం రాజు, తాను రాజీనామా చేయడం ఖాయమని మరోమారు స్పష్టం చేశారు. అంతే కాదు, ఉప ఎన్నికల్లో నరసాపురం నుంచే తిరిగి పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్త పరుస్తున్నారు. అంతే కాదు, నియోజక వర్గంలో తమ గెలుపుతో పాటుగా రేపటి ఎన్నికల్లో వైసీపీ ఓటమికి అవసరమైన విధంగా రఘురామ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.  ఆయన ఆదరూ అనుకుంటున్నట్లుగా బీజేపీలో అయితే చేరడం లేదు..అందరి వాడుగా ఇండిపెండెంట్  గా పోటీ చేయాలని,ఆయన నిర్ణయానికి వచ్చారు. నిజానికి ఆయన బీజేపి తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందుకు  బీజేపీ  నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే రాష్ట్రంలో  నెలకొన్ని రాజకీయ పరిస్థితులో ఆయన స్వతంత్ర అభ్యర్దిగానే పోటీ చేయాలని, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తే ఉమ్మడి శత్రువు, వైసీపీని ఓడించడం సులభమవుతుందని, తెలుగు దేశం, జనసేన సూచించిన నేపధ్యంలో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసేందుకు సిద్డమయ్యారని తెలుస్తోంది. తిరుపతిలో అమరావతికి మద్దతుగా జరిగిన సభకు ముందే ఈ నిర్ణయానికి వ్యూహం సిద్దమయినట్లు తెలుస్తోంది. అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా, అమరావతి రైతుల పాదయాత్రలో బీజేపీ నాయకులు పాల్గొనాలని ఆదేశించింది, మొదలు బీజేపీ నాయకత్వం కనుసన్నల్లో భారీ కసరత్తు జరిగనట్లు సమాచారం. ఉప ఎన్నికలో అమరావతి అంశం ప్రధాన అస్త్రంగా బరిలోకి దిగటం ద్వారా..అమరావతికి మద్దతిస్తున్న పార్టీలు రఘురామకు మద్దతిచ్చేలా తెర వెనుక రాజకీయం నడుస్తోంది. బీజేపీ - జనసేన - బీజేపీ మద్దతుతో రఘురామను గెలిపించాలనేది ప్రస్తుత వ్యూహంగా ఉందని అంటున్నారు. మరోవైపు నర్సాపురంలో రాజకీయ, సామాజిక సమీకరణాలు కూడా, ప్రయోగానికి అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. నియోజక వర్గంలో మొత్తం  12 లక్షల మందికి పైగా ఓటర్లు  ఉన్నారు. అందులో 2014, 2019 రెండు సార్లు వైసీపీకి  నాలుగు నుంచి ఐదు  లక్షల ఓట్లు వచ్చాయి. అదే సమయంలో బీజేపీ ఇక్కడ రెండు సార్లు గెలిచింది. 1999లో కృష్ణంరాజు, 2014లో గోకరాజు గంగరాజు బీజేపీ అభ్యర్ధులుగా గెలిచారు. అలాగే, 2009 లో ప్రజారాజ్యం అభ్యర్ధికి 2.67 లక్షలు, 2019లో జనసేన అభ్యర్ధి నాగబాబుకు 2.50 లక్షల ఓట్లు వచ్చాయి. టీడీపీకి 4.15 లక్షల ఓట్లు వచ్చాయి. ఈలెక్కలను బట్టి చూస్తే, ఆ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు వచ్చినా రఘురామ కృష్ణం రాజు గెలుస్తారు. అలాగే, సామాజికంగా చూసినా నరసాపురంలో అయితే రాజులు (క్షత్రియులు) కాదంటే కాపులు . ఈ రెండు సామజిక వర్గాల నుంచే ఎంపీ, ఎమ్మెల్ల్యేలు గెలుస్తూ వచ్చారు. అందుకే, తెలుగు దేశం, జనసేన, బీజేపీ పార్టీల మద్దతుతో ఆయన స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగాలనే నిర్ణయానికి వచ్చారు. అదలా ఉంటే, నరసాపురం ఉప ఎన్నిక నూతన రాజకీయ సమీకరణలకు శ్రీకారం చుడుతుందని అంటున్నారు. నర్సాపురం నుంచే వైసీపీ  ప్రత్యర్ధి పార్టీల కూటమి పురుడు పోసుకుంటుందని, అంటున్నారు. యుద్ధమూ అక్కడి నుంచే మొదలవుతుందని అంటున్నారు, విశ్లేషకులు.

Related Posts