YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దళితుల ఓట్లే కీలకం

దళితుల ఓట్లే కీలకం

న్యూఢిల్లీ, జనవరి 12,
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో దేశంలో రాజకీయ వాతావరణం మారింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడతాయని కొందరు భావించారు. కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఆ పని చేయలేదు. సకాలంలో ఎన్నికలు జరపటానికే మొగ్గు చూపుతూ శనివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 మధ్య పలు దశలలో పోలింగ్‌ జరుగుతుంది. మార్చి పదవ తేదీన ఫలితాల వెల్లడితో ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పరిసమాప్తమవుతుంది.ఎలక్షన్‌ జరిగే ఐదు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌, పంజాబ్ బీజేపీ, కాంగ్రెస్‌కు చాలా కీలకం. ఇక, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ చిన్న రాష్ట్రాలే అయినా..వాటికి ఇప్పుడు అధిక రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవలి, గోవా, మణిపూర్‌ పరిణామాలు ఈ ఎన్నికలపై ఆసక్తి రేపుతున్నాయి. ఐదు రాష్ట్రాలకు కలిపి మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. పద్దెనిమిది కోట్ల 34 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అంటే దాదాపు ఐదవ వంతు దేశ ప్రజల పొలిటికల్‌ మూడ్‌ ఈ ఎన్నికల ద్వారా తెలిసే అవకాశం ఉంది.ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న వేళ మనం కొన్ని ఆసక్తికరమైన అంశాలను గమనించవచ్చు. ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ ఎన్నికలకు జాతీయ ప్రాధాన్యం ఏర్పడంది.రెండు ప్రధాన జాతీయ పార్టీలు చెరో చోట అధికారంలో ఉండటం అందుకు ఒక కారణం. అధికారం నిలబెట్టుకునేందుకు ఇరు పార్టీలు శతవిధాలా ప్రయత్నిస్తాయి. ఈ రెండు జాతీయ పార్టీల లోక్‌సభ స్థానాలలో ఐదో వంతు సీట్లు ఈ రాష్ట్రాలలోనే ఉన్నాయి.2019 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ సాధించిన 52 సీట్లలో 8 పంజాబ్‌ నుంచే వచ్చాయి. అలాగే బీజేపీ గెలిచిన 301 లోక్‌సభ సీట్లలో 62 యూపీ నుంచి వచ్చాయి. కాబట్టి, జాతీయ రాజకీయాలను మరింత ప్రభావితం చేయాలంటే పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకోవటం కాంగ్రెస్ కు చాలా కీలకం. అలాగే దేశ రాజకీయాలపై బీజేపీ పట్టు కొనసాగాలంటే యూపీలో గెలిచి తీరాల్సిందే. ఐతే, ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రధాన ప్రత్యర్థులు కావు. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ మాదరి పోటీ ఈ ఎన్నికల్లో వీటి మధ్య లేదు. పంజాబ్‌, యూపీలో ఈ రెండు పార్టీలు ప్రధాన శక్తులుగా ముఖాముఖి తలపడటం లేదు.కానీ, పంజాబ్‌, యూపీలో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల ఊపు కనిపిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ సభలకు జనం పోటెత్తటమే అందుకు ఉదాహరణ. సీఎం యోగి సభలకు ధీటుగా అఖిలేష్‌ సభలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అలాగే పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ కన్నా ఆమ్ ఆద్మీ పార్టీ గురించే జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మొదట్లో ఈ రెండు రాష్ట్రాలలో అధికార పార్టీదే పై చేయి అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది.నిజానికి పంజాబ్‌లో బీజేపీకి పెద్దగా ఉనికి లేదు. అలాగే యూపీలో ఇప్పుడు కాంగ్రెస్‌ పరిస్థితి కూడా అలాగే ఉంది. కాబట్టి ఈ రెండు జాతీయ పార్టీలది ఇక్కడ మనుగడ కోసం పోరాటం. నిన్న మొన్నటి వరకు పంజాబ్‌లో శిరోమణి ఆకాళీదల్‌తో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళ్లింది. కానీ, సాగు చట్టాలతో సిక్కులు , బీజేపీ మధ్య పూడ్చలేనిఅగాథం ఏర్పడింది. అందుకే ఈసారి బీజేపీ -అకాలీదళ్‌ కలిసి పోటీ చేయటం కష్టమే.ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే సీఎం యోగి ఆదిత్యనాథ్.. మోడీ వారసుడిగా ఆవిర్భవిస్తారు. ఇటీవల కొన్ని నెలలుగా ఆయన తనదైన మార్క్‌ ప్రచారంతో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సిసలైన హిందూ నేతగా ఎదుగుతున్నారు. పార్టీలోని ఇతర ముఖ్యమంత్రులకు భిన్నంగా ఆదిత్యనాథ్ ఇప్పటికే మోడీ నీడకు దూరంగా వచ్చేశారు. మరోవైపు, కాంగ్రెస్‌ రాష్ట్ర ఇంఛార్జ్‌ ప్రియాంక గాంధీ పనితీరు ఏమిటో ఈ ఎన్నికల ద్వారా తెలిసిపోతుంది.ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే ఓ బలమైన ఓబీసీ సామాజిక వర్గానికి సమాజ్ వాదీ పార్టీ ప్రతినిధి. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్‌ మైనార్టీ రాజకీయాలు చేస్తోంది. ఈ రెండు పార్టీలు ఇప్పుడు సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. ఇన్నాళ్లుగా వారు అనుసరిస్తున్న సాంప్రదాయ వ్యూహాలకు కాలం చెల్లటమే వాటి పతనానికి ఒక కారణం. అవినీతితో నిండిన వారసత్వ రాజకీయాలను ప్రజలు అంగీకరించే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది మరో కారణం.ఇక, దళితుల గురించి ప్రస్తావించకుండా యూపీ రాజకీయలపై చర్చ ఉండదు. దేశంలో దళిత రాజకీయాలకు యూపీ కేంద్ర స్థానంగా ఉంటూ వస్తోంది. కానీ ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొద్ది రోజుల క్రితం వరకు రాష్ట్రంలో దళిత రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసిన బహుజన సమాజ్‌ పార్టీ ఇప్పుడు బలహీనపడింది. గతంలో పలు పర్యాయాలు అధికారం చెలాయించిన ఆ పార్టీ ఇప్పుడు అంతర్థానం అయ్యే దశకు చేరింది.ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ దెబ్బతినటంతో దళిత ఓటు బ్యాంకును ఎస్పీ, బీజేపీ పంచుకోబోతున్నాయి. ఈ పరిణామం రేపటి ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నవి పరిశీలకులలో ఆసక్తి రేపుతోంది. అలాగే, పంజాబ్‌లో కూడా దళిత ఓట్లు రేపటి ఎన్నికల ఫలితాలను నిర్దేశించే అవకాశం ఉంది. దళితుడైన చరణ్‌జీత్‌ సింగ్ చన్నీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం కచ్చితంగా కాంగ్రెస్‌కు అనుకూలించే అంశం. కాబట్టి, దళిత ఓట్లను సంఘటితం చేసేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఇకపై దళిత రాజకీయాల భవిష్యత్‌ను ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తెలిసిపోతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ దళితుల్లో తమ ఆదరణ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దళితులు ఎటు వెళతారు అన్నది చూడాల్సి వుంది.మరోవైపు, బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తమ తమ రాష్ట్రాల వెలుపల రాజకీయ అదృష్టాన్ని ఈ ఎన్నికలతో పరీక్షించుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో మోడీ కి ప్రధాన ప్రత్యర్థిగా అవతరించటంపై ఇరువురు నేతలు ఇప్పుడు దృష్టి సారించారు. ఇందులో భాగంగా , కేజ్రీవాల్‌ తన ఫోకస్‌ అంతా పంజాబ్‌ మీదనే కేంద్రీకరించారు. గత ఎన్నికల్లో ఇక్కడ ఆప్‌ రెండవ అతి పెద్ద పార్టీగా నిలిచింది.మరోవైపు, మమతా బెనర్జీ గోవాలో గెలవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అయితే, ఆప్‌కు కూడా గోవాలో చెప్పుకోదగిన ఓటింగ్‌ ఉంది. దాంతో పాటు ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలలో కూడా బలమైన శక్తిగా ఎదిగి 2024 నాటికి ఆప్‌ని జాతీయ పార్టీగా తీర్చిదిద్దాలని కేజ్రీవాల్‌ వ్యూహరచన చేస్తున్నారు. మరోవైపు, మణిపూర్‌లో కీలక శక్తిగా నిలవాలని తృణమూల్‌ కోరుకుంటోంది. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో సత్తా చాటితేనే ఈ రెండు పార్టీలు జాతీయ రాజకీయాలను ప్రభావం చేస్తాయి. 2024 ఎన్నికల నాటికి తమ శక్తని మరింత పెంచుకునేందుకు రేపు అవి సాధించే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌, బీజేపీలకే కాదు వీటికి కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికలు పరీక్షని చెప్పాల్సి వుంటుంది.

Related Posts