YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొండా చరిత్ర... పొలిటిక‌ల్ వార్

కొండా చరిత్ర... పొలిటిక‌ల్ వార్

హైదరాబాద్, జనవరి 29,
కొండా ముర‌ళి, ఎర్రబెల్లి దయాకర్‌రావు మధ్య పొలిటిక‌ల్ వార్ ఓ రేంజ్‌లో సాగింది. ఇద్దరివీ వేరు వేరు నియోజకవర్గాలు. రాజకీయాల్లో ఎర్రబెల్లిది క్లీన్ ఇమేజ్. కొండా మురళిది మాత్రం డిఫ‌రెంట్ యాంగిల్‌. క‌ట్ చేస్తే.. తన భర్తను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు హత్య చేయించ‌డానికి కుట్ర చేస్తున్నాడంటూ, తన మాంగళ్యం కాపాడాలంటూ.. నిండు అసెంబ్లీలో ఎమ్మెల్యే సురేఖ అప్పటి సీఎం చంద్రబాబును వేడుకోవడం సినిమాటిక్‌గానే ఉంటుంది.  కొండా చ‌రిత్ర ఖ‌త‌ర్నాక్‌గా ఉంటుంది, హత్యలు, బెదిరింపులు, అక్రమ ఆయుధాలు లాంటి 19 కేసుల్లో నిందితుడిగా ఉండి, కోర్టు విచారణలో అన్ని కేసుల్లోనూ నిర్దోషిగా బయటికొచ్చారు కొండా ముర‌ళి. 2002 ఏప్రిల్‌లో అప్ప‌టి తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు, డైన‌మిక్ లీడ‌ర్‌, కొండాకు కొరుకుడుప‌డ‌ని నాయ‌కుడైన‌.. కొల్లి ప్రతాప్‌రెడ్డి వెళుతున్న కారుపై స‌డెన్‌గా అటాక్ జ‌రిగింది. రాయ‌ల‌సీమకు చెందిన కిరాయి రౌడీలు బాంబుల‌తో దాడి చేసి న‌డిరోడ్డుపై కొల్లి ప్ర‌తాప్‌రెడ్డిని చంపేయ‌డం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ మ‌ర్డ‌ర్ కొండా ముర‌ళి చేయించిందే.. అని ఆ కేసులో నిందితుడిగా చేర్చారు పోలీసులు. అప్పటి వరంగల్‌ ఎస్పీ నళిన్‌ ప్రభాత్‌.. కొండా మురళికి బేడీలు వేసి.. చొక్కా విప్పించి.. హనుమకొండ చౌరస్తాలో, ఆయ‌న స్వ‌గ్రామ‌మైన‌ వంచనగిరిలో.. పరేడ్‌ చేయించిన సీన్ వ‌రంగ‌ల్‌వాసుల‌కు ఇప్ప‌టికీ గుర్తే. సినిమాటిక్‌గా సాగిన ఆ సీన్ ఆర్జీవీ తీయ‌బోయే మూవీలో ఉంటుందా? ఉండ‌దా? అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌. 2003లో పీపుల్స్‌వార్‌ జిల్లా కార్యదర్శి ఆర్కేతో సంబంధాలు కలిగిఉన్నారనే ఆరోపణలపై కొండా మురళి–సురేఖలపై ‘పోటా’ కేసు నమోదుకావడం సంచ‌ల‌నం. ఆర్కేకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను కొండా మురళి సమకూర్చాడని.. అందుకు ప్ర‌తిఫ‌లంగా ఎర్ర‌బెల్లిని న‌క్స‌ల్స్ చంపాల‌ని.. ఆర్కే-కొండా మ‌ధ్య డీల్ కుదిరింద‌ని పోలీసులు ప్రకటించ‌డం అప్ప‌ట్లో షాకింగ్ న్యూస్‌. ఆ కేసుకు పోలీసుల‌పై ఎర్ర‌బెల్లి ఒత్తిడే కార‌ణ‌మ‌నేది కొండా ఆరోప‌ణ‌. PWGపై తీవ్ర నిర్బంధం ఉన్న రోజుల్లో.. వరంగల్ సెంట్రల్ జైలు నుంచి విడుదలైన నక్సలైట్ జిలానీబేగంను తన వాహనంలో ఇంటికి తీసుకువెళ్ళి, భోజనం పెట్డించి పంపించడం.. కొండా ముర‌ళికి న‌క్స‌ల్స్ మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌కు ఎగ్జాంపుల్‌గా చూపిస్తారు. కొండా ముర‌ళి-సురేఖ‌ల‌కు వైఎస్‌తో ఉన్న అనుబంధం, ఆయ‌న అండ‌, ఆద‌ర‌ణ ఒక ఎత్త‌యితే,  గ‌డ్డం తీసేసి ఎప్పుడూ క్లీన్‌షేవ్‌తో క‌నిపించు అని వైఎస్ చేసిన సూచ‌న‌.. దానిని ముర‌ళి ఆచ‌రించిన తీరు.. సినిమాటిక్‌గానే ఉంటుంది. 2009లో వైఎస్‌ రెండోసారి సీఎం అయినప్పుడు.. సురేఖ మంత్రి కావడం, వైఎస్‌ మరణానంతరం జగన్‌కు మ‌ద్ద‌తుగా మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్‌సీపీలో చేర‌డం ఆస‌క్తిక‌రం. జ‌గ‌న్ ద‌గ్గ‌ర వివిధ పెట్టుబ‌డుల రూపంలో వంద‌ల కోట్ల సొమ్ము ఇరుక్కుపోయింద‌ని.. ఆ డ‌బ్బు కోస‌మే జ‌గ‌న్ వెంట ఉన్నార‌ని.. జ‌గ‌న్‌ను అడిగి అడిగి విసిగి వేసారి.. ఇక ఆ డ‌బ్బులు రావ‌ని తెలిసి.. జ‌గ‌న్‌ను వ‌దిలేసి టీఆర్ఎస్‌లో చేరార‌ని అంటారు. భార‌తి సిమెంట్‌లో పెట్టిన  ఆ 2 వంద‌ల కోట్ల పెట్టుబ‌డుల‌ విష‌యం గురించి జిల్లాలో ఇప్ప‌టికీ మాట్లాడుకుంటారు. 2010లో మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్ రాళ్ల దాడి ఘ‌ట‌న కొండా రాజ‌కీయ చ‌రిత్ర‌లో కీల‌క ఘట్టం. జ‌గ‌న్ ప్ర‌యాణిస్తున్న రైల్‌ను ఉద్య‌మ‌కారులు అడ్డుకోవ‌డం.. హ‌రీష్‌రావును కొండా సురేఖ ప‌చ్చిబూతులు తిట్ట‌డం.. మ‌హ‌బూబాబాద్ రైల్వే స్టేష‌న్లో ట్రాక్‌పై ఉన్న రాళ్ల‌తో కొండా అనుచ‌రులు.. ఉద్యమకారులపై రాళ్ల‌తో దాడి చేయ‌డం.. ప్ర‌తిదాడి నుంచి ర‌క్ష‌ణ‌గా కొండా ముర‌ళి తుపాకీతో కాల్పులు జ‌ర‌ప‌డం.. అబ్బో.. అప్ప‌ట్లో ర‌చ్చ రంభోలా జ‌రిగింది. క‌ట్ చేస్తే.. 2014లో కొండా ఫ్యామిలీ హ‌రీష్‌రావు స‌మ‌క్షంలో టీఆర్‌ఎస్‌లో చేరడం, ప‌ర‌కాల నుంచి షిఫ్ట్ అయి.. వరంగల్‌ తూర్పులో కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలుపొంద‌టం రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే అని నిరూపించారు. అయితే, 2018 ఎన్నికల నాటికి సీన్ మారిపోయింది. కొండా దంప‌తుల ఆగ‌డాలు, అరాచ‌కాల‌పై వ‌రంగ‌ల్ ప్ర‌జ‌లు, పార్టీ నాయ‌కులు కేసీఆర్ ద‌గ్గ‌ర మొర‌పెట్టుకోవ‌డంతో.. కొండా సురేఖ‌కు టికెట్ ఇవ్వ‌లేదు టీఆర్ఎస్‌. దీంతో.. మ‌ళ్లా కాంగ్రెస్‌లో చేరి.. వ‌రంగ‌ల్‌ను వీడి ప‌ర‌కాలలో పోటి చేసి ఘోర ప‌రాజ‌యం పాలయ్యారు. అప్ప‌టి నుంచి సైలెంట్‌గా అదును కోసం ఎదురుచూస్తున్న కొండా ఫ్యామిలీకి.. ఇటు రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ కావ‌డం.. అటు ఆర్జీవీ సినిమా తీస్తుండ‌టం.. కొండా దంప‌తుల‌కు బాగా క‌లిసిరానుందంటున్నారు. కొండా ముర‌ళిలో అనేక షేడ్స్ ఉన్నాయంటారు. సాయిబాబాకి మురళి పరమభక్తుడు. తన ఇలాఖాలోని కోటగండి ద‌గ్గ‌ర‌ సాయినాథుడికి గుడి కట్టించారు. ఏటా  వినాయక నవరాత్రి ఉత్సవాల వేళ.. 9 రోజుల పాటు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారు. ముర‌ళి ప‌క్కా మాస్ లీడ‌ర్‌. 'అబ్బర పులి... కొండా మురళి' లాంటి స్లోగ‌న్స్‌తో ఆయ‌న అభిమానులు అద‌ర‌గొడుతుంటారు. బాంచెన్ ప‌టేల్‌ అంటూ త‌న‌కు న‌మ్మ‌కంగా ఉండే వారిని బాగా చూసుకుంటార‌ని.. తోక జాడిస్తే.. పాతాళంలోకి తొక్కేస్తార‌ని చెబుతుంటారు. ఆయ‌న‌ ఆఫీసులో త‌న‌కు మాత్ర‌మే కుర్చీ ఉంటుందని.. ముర‌ళిని క‌లిసేందుకు వ‌చ్చే సామాన్యులంతా ఆయ‌న ముందు చేతులు క‌ట్టుకొని నిల‌బ‌డే ఉండాల‌నేది అన‌ధికారికి రూల్‌. ఆయ‌న ఎటువెళ్లినా భారీ కాన్వాయ్‌తో వెళుతుంటారు. వ‌రంగ‌ల్ జిల్లా ర‌క్త‌చ‌రిత్ర‌లో ముర‌ళి పాత్ర ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంది. అప్ప‌ట్లో న‌క్స‌ల్స్.. కొండా ముర‌ళిని చంపేందుకు ఆయ‌న‌పై తుపాకుల‌తో ఫైరింగ్ చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్‌తో ఉన్న ముర‌ళిని ఆ న‌క్స‌ల్స్ తూటాలు ఏమీ చేయ‌లేక‌పోయాయి. అంత‌లోనే ముర‌ళి తేరుకొని.. ఓ న‌క్స‌ల్స్ నుంచి తుపాకీ లాక్కొని ఎదురుదాడి చేయ‌డంతో అన్న‌లు అక్క‌డి నుంచి ప‌రార‌య్యారు. ఆ కాల్పుల్లో ఆయ‌న త‌ల‌లోకి ఓ తూటా ముక్క దూసుకెళ్ల‌గా.. అది ఇప్ప‌టికీ కొండా ముర‌ళీ త‌ల‌లో అలానే ఉంది. దానితో ఏం ప్ర‌మాదం లేద‌ని వైద్యులు అలానే ఉంచేశారు. ఆ దాడిలో ఆయ‌న ఓ క‌న్ను కోల్పోగా.. ప్ర‌స్తుతం ఉన్న‌ది గాజు క‌న్ను అని అంటారు. కొండా ముర‌ళి జీవితంలో ఇంత‌టి ఖ‌త‌ర్నాక్ సీన్స్ ఉంటే.. ఆర్జీవీ దృష్టిలో ప‌డ‌కుండా ఎలా ఉంటారు? ట్రైల‌ర్‌లోనూ కొండాపై కాల్పుల సీన్ ఉంది.అయితే, కొండా లైఫ్‌లో ఎన్ని పాజిటివ్ షేడ్స్ ఉంటాయో అంత‌కుమించి నెగ‌టివ్ రోల్ క‌నిపిస్తుంది. మ‌రి, ఆర్జీవీ ఈ మంచి-చెడుల‌ను బ్యాలెన్స్ చేస్తారా? త‌న‌దైన స్టైల్‌లో విల‌నిజం, హీరోయిజం మిక్స్ చేసి చూపిస్తారా? టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, ప‌బ్లిసిటీతో పిచ్చెక్కించి.. ఎప్ప‌టిలానే చివ‌రాఖ‌రికి సినిమాతో తుస్సుమ‌నిపిస్తారా? లేక‌, ర‌క్త‌చ‌రిత్ర‌, వంగ‌వీటి త‌ర‌హా హిట్ కొడ‌తారా? రాజ‌కీయంగా ప‌త‌నావ‌స్థ‌కు చేరి.. పున‌ర్‌వైభ‌వం కోసం గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్న కొండా దంప‌తుల‌కు.. ఆర్జీవీ మేడ్ "కొండా" మూవీ ఏమేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి....

Related Posts