YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు రెండు వారాల గడువు

విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు  రెండు వారాల గడువు

న్యూ ఢిల్లీ,ఫిబ్రవరి 11
భారతీయ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన వ్యాపారస్థుడు విజయ్ మాల్యాపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ అపెక్స్ కోర్టు విజయ్‌ మాల్యా ను హెచ్చరించింది. కోర్టు ధిక్కరణ కేసులో హాజరు అయ్యేందుకు విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు  రెండు వారాల గడువు ఇచ్చింది. ఇది చివరి అవకాశం అంటూ ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతోపాటు ఈ మనీలాండరింగ్ కేసు విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. 24 లోగా వ్యక్తిగతంగా లేదా ఆయన తరపున న్యాయవాది కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది అపెక్స్‌ కోర్టు. హాజరుకాకపోతే ఈ కేసు ముగింపునకు సంబంధించి తామే తుది నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2017లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ, కుమారుడు, కుమార్తెలకు 40 మిలియన్‌ డాలర్లను బదిలీ చేశారు మాల్యా. దీంతో ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, మాల్యాను కోర్టు ధిక్కరణ కింద దోషిగా తేలుస్తూ 2017 మే నెలలో తీర్పు చెప్పింది.కానీ, అప్పటికే విజయ్ మాల్యా లండన్‌ పారిపోయారు. ఆ తర్వాత ఆయన భారత్‌కు తిరిగి రాలేదు. అదే సమయంలో విజయ్‌ మాల్యాను దివాలాదారుగా ప్రకటించింది లండన్‌ కోర్టు. మాల్యాకు సంబంధించిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాంకుల కన్సార్షియంకు గతంలోనే అనుమతి ఇచ్చింది. దీంతో నిలువ నీడ లేని పరిస్థితికి చేరుకున్నారాయన. ఇన్ని సంవత్సరాలు ఆయన తలదాచుకుంటూ వస్తోన్న లండన్‌లోని విలాసవంతమైన బంగళా కూడా మాల్యా చేజారిపోయింది. అటు వేల కోట్ల రుణాలు ఎగవేసిన కేసుల్లో నిందితుడిగా ఉన్న మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు అంగీకారం తెలిపింది బ్రిటన్‌ ప్రభుత్వం. కానీ పలు కారణాలు చెబుతూ విజయ్‌ మాల్యా అక్కడే తలదాచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారత సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Related Posts