గత నాలుగు సంవత్సరాలలో ఎక్సైజ్ విధానాన్ని మూడు సార్లు, పారిశ్రామిక విధానాన్ని రెండు సార్లు ప్రకటించినా ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించకపోవడాన్ని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్ రావు తీవ్రంగా తప్పుపట్టారు.తెలంగాణ గ్రామాలలో అడుగడుగునా మద్యం దుకాణాలు, సారా దుకాణాలు పెట్టి బలవంతంగా గ్రామస్తులను మద్యానికి బానిసలుగా తయారు చేస్తున్నారని, వాళ్ల ఒళ్లు గుల్ల చేస్తున్నారని అన్న వ్యాఖ్యలను వక్రీకరిస్తూ, భారతీయ జనతా పార్టీపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, మా రాష్ట్ర నాయకులపై విపరీతమైన కథలు, కథనాలు, అవాస్తవాలు ప్రచురించడానికి అలవాటుపడ్డ ఒక పత్రిక తన వ్యాఖ్యలను వక్రీరించి ప్రచురించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ అవాస్తవాలైన వార్తని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు ఎదురుదాడి చేయడం దారుణం. ఇది వారి అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతుందని పేర్కొన్నారు. తెలంగాణ బిజెపి రైతుల పట్ల ఎనలేని గౌరవం, అంకితభావం, సానుభూతితో పని చేస్తుంది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా పార్టీ తరఫున తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై పూర్తి అవగాహనతో గత నాలుగు సంవత్సరాలుగా గొంతెత్తి మాట్లాడుతున్నానని, ప్రభుత్వ నిర్లక్ష్యంపై, విధానాల లోపంపై, అధికార దుర్వినియోగంపై, రైతులపై జరుగుతున్న అక్రమాలపై మీడియా సమావేశాల ద్వారా, మీడియా డిబేట్లలో, పత్రికలలో వ్యాసాల ద్వారా నిరంతరంగా పోరాడుతున్నానన్నారు.ఇది నాపై జరుగుతున్న అవకాశవాద రాజకీయ దుష్ప్రచారంగా భావిస్తున్నానని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు ప్రభుత్వ విధాన లోపాలపై ప్రశ్నించే బాధ్యత, హక్కు ఉంటాయన్నది గుర్తించాలన్నారు. విమర్శించే గొంతును నొక్కే క్రమంలో, చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ ఒక పత్రిక రాయడం, దానిపై అనాలోచితంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎదురుదాడి చేయడం అప్రజాస్వామికమని కృష్ణసాగర్ రావు పేర్కొన్నారు.