YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పంజాబ్ లో నువ్వా... నేనా

పంజాబ్ లో నువ్వా... నేనా

ఛండీఘడ్, ఫిబ్రవరి 19
ఉత్తరప్రదేశ్‌ తర్వాత అత్యంత ఆసక్తిని కలిగిస్తున్నవి పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలే! నిజానికి ఆసక్తిని కలిగిస్తున్నవి అక్కడి రాజకీయ పార్టీలే! పరస్పర ఆరోపణలతో ఎన్నికల వేడిని పెంచింది కూడా అవే! ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఇబ్బంది పెట్టడం కోసం ఉగ్రవాది అనే ముద్రను వేసినప్పటికీ జనం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.. మరి ఆ పట్టించుకోకపోవడం వెనుక ఆమ్‌ ఆద్మీ పార్టీపై ఉన్న అభిమానమా? లేక పాలిటిక్స్‌లో ఇవి మామూలేనన్న భావనా అన్నది ఇప్పుడు చెప్పడం కష్టమే! పంజాబ్‌లో మార్పులు తెస్తామంటూ ప్రతీ పార్టీ చెబుతూ వచ్చాయి. అందుకు అనుగుణంగా మేనిఫేస్టోలను రూపొందించుకున్నాయి. రేపటి ఎన్నికల్లో జనం స్పందన ఏ విధంగా ఉండబోతున్నదన్నది ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ మోడల్‌ పాలనను అందిస్తామంటున్న ఆప్‌కు పట్టం కడతారా? కాంగ్రెస్‌ పార్టీకి రెండోసారి అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తిగా ఉంది.ఆమ్‌ ఆద్మీ పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీలులేదు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో ఆ పార్టీ నాలుగు లోక్‌సభ స్థానాలను గెల్చుకుంది. ఎప్పటికైనా పంజాబ్‌లో ఆప్‌ అధికారంలోకి వస్తుందని అప్పుడు రాజకీయ విశ్లేషకులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. 2017 ఎన్నికల్లోనే ఇది జరగవచ్చని అనుకున్నారు కానీ ఆ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసేంత సీట్లు గెల్చుకోలేకపోయింది. 23.17 శాతం ఓట్లతో 20 అసెంబ్లీ స్థానాలు గెల్చుకుని రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఆప్‌తో ఎప్పటికైనా ప్రమాదకరమేనని అప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు అర్థమయ్యింది. అయితే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ ఒక్క లోక్‌సభ స్థానం కూడా లభించలేదు. ఇది కాంగ్రెస్‌నే కాకుండా మరో జాతీయ పార్టీ అయిన బీజేపీకి కూడా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సంబరం ఎంతో కాలం నిలవలేదు. పంజాబ్‌లో ఇప్పుడు ఆప్‌ బలమైన పార్టీగా మారింది. కాంగ్రెస్‌కు నిద్రపట్టకుండా చేస్తోంది. అధికారంలోకి వస్తే ఢిల్లీ తరహా పాలనను అందిస్తామని, ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ను అందిస్తామని ఆప్‌ ప్రచారం చేస్తూ వచ్చింది. అదీ కాకుండా ఢిల్లీలో విద్య, వైద్య రంగాలలో కేజ్రీవాల్‌ తీసుకొచ్చిన మార్పులు చాలా మందిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతానికి అయితే కేజ్రీవాల్‌పై ఎలాంటి మచ్చా లేదు. విశ్వాస్‌ కుమార్‌ శర్మ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌, బీజేపీలు కాసింత హడావుడి చేసినా ప్రజలు మాత్రం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పైగా ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చేసిన అభివృద్ధిపై జనం చర్చించుకుంటున్నారట.
ఎలాగైనా సరే పంజాబ్‌లో అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్నారు కేజ్రీవాల్‌. అంటే విశ్వాస్‌కుమార్‌ శర్మ చెప్పినట్టు కాదు. ప్రజాస్వామ్య పద్దతుల్లోనే ఆయన పంజాబ్‌లో పాగా వేయాలనుకుంటున్నారు. ఇందుకోసం 2017 నుంచి హోమ్‌వర్క్‌ చేస్తూ వచ్చారు. అప్పుడు దొర్లిన తప్పులను ఇప్పుడు కరెక్ట్‌ చేసుకున్నారు. మరే రాజకీయ పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్‌ ద్వారా పార్టీ రాజ్యసభ సభ్యుడు భగవత్‌ మన్‌ను సీఎం అభ్యర్థిగా నిలబెట్టారు కేజ్రీవాల్‌. ఇలాంటివి మనం పాశ్చాత్య దేశాలలోనే చూస్తాం. అలాగే పంజాబ్‌ ఓటర్లలో 45 శాతం మంది మహిళలే! అంటే 96 లక్షల మంది ఉన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది ఆప్. పైగా వారంతా ఉన్నత విద్యను అభ్యసించినవారే. తాము అధికారంలోకి వస్తే చేసే పనులపై స్పష్టతనిచ్చింది ఆప్‌. అక్రమ ఇసుక ద్వారా రాష్ట్రం 20 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకుంటామని కేజ్రీవాల్‌ చెబుతున్నారు. ఇసుక మాఫియాలో ముఖ్యమంత్రి చన్నీతో పాటుగా ఆయన సహచర మంత్రులు కూడా ఉన్నారని అంటున్నారు. ఇప్పటి వరకు పంజాబ్‌ ప్రజలు కాంగ్రెస్‌ పాలనను చూశారు. అకాలీల పాలననూ చూశారు. ఈ రెండు ప్రభుత్వాలతో విసుగెత్తిపోయిన పంజాబ్‌ ప్రజలకు ఆప్‌ కొత్తగా కనిపిస్తోంది. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారే కాకుండా పాతికేళ్ల యువత కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీ వైపు చూస్తోంది. ఆప్‌ అధికారంలోకి వస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్ముతోంది. అయితే ఆప్‌కు కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. పార్టీకి బలమైన క్యాడర్‌ లేదు. గత అయిదేళ్లలో సగానికి సగం మంది ఎమ్మెల్యేలు పార్టీని వదిలిపెట్టారు. కేజ్రీవాల్‌పై జనంలో ఉన్న అభిమానమే పార్టీని గెలిపించాలి..కాంగ్రెస్‌పార్టీ విషయానికి వస్తే వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చే సువర్ణవకాశాన్ని ఆ పార్టీ చేజేతులా జారవిడుచుకుంటుందేమోననిపిస్తోంది. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ.. పంజాబ్‌లో అది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ శిరోభారంగా మారారు. ఎప్పుడు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని కాంగ్రెస్‌ అధినాయకత్వం భయపడుతోంది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్ చన్నీతో విభేదాలు ఉన్న విషయాన్ని సిద్ధూ పదే పదే బయటపెట్టుకుంటున్నారు. చన్నీపై చేస్తున్న విమర్శలు పరోక్షంగా పార్టీపై ప్రభావం చూపుతాయన్న సోయి కూడా లేకుండా సిద్ధూ విపరీత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఫలితంగా ప్రజలలో చులకన అవుతున్నారు. కాకపోతే పంజాబ్‌లో 32 శాతం మంది దళితులు ఉండటం, చన్నీ దళితుడు కావడం కాంగ్రెస్‌కు అనుకూలిస్తున్న అంశం. కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ తర్వాత గత ఏడాది సెప్టెంబర్‌లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చన్నీ కొన్ని ప్రజాకర్షక పథకాలను తీసుకొచ్చారు.. అవి ఎన్నికల్లో ఓట్లను కురిపిస్తాయో లేదో చూడాలి. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే దాదాపు 60 నిర్ణయాలు తీసుకున్నారు చన్నీ. అసంఘటిత కార్మికులకు వేతనాలు, పెంపు, ప్రభుత్వ ఉద్యోగులకు పే కమిషన్, నిర్మాణ రంగ కార్మికులకు ప్రత్యేక సాయం, పదో తరగతి వరకు పంజాబీ భాష తప్పనిసరి, రెండు కిలోవాట్ల లోడ్‌ వరకు గృహ వినియోగదారుల విద్యుత్‌ బకాయిల మాఫీ , లక్ష కొత్త రేషన్‌ కార్డుల జారీ ..ఇలాంటి వాటినెన్నింటినో చేపట్టారు చన్నీ. ఇక మేనిఫెస్టోలో ఇంకొన్ని వాగ్దానాలు చేసింది కాంగ్రెస్‌ పార్టీ. యువతను ఆకట్టుకునేందుకు అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామంటోంది.ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఆ పార్టీ అధికారంమీద ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్నప్పటికీ పంజాబ్‌ రైతుల ఆగ్రహం అలాగే ఉంది. అమరీందర్‌ సింగ్‌ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ పెద్దగా వర్క్‌ అవుటయ్యేలా కనిపించడం లేదు. బీజేపీ-పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ కూటమి ప్రభావం నామమాత్రంగానే ఉంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న పలువురు సిక్కు మత ప్రముఖులతో తన నివాసంలో సమావేశమయ్యారు. సిక్కు మతస్తుల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను వారికి వివరించారు. ఇంత చేస్తున్నా బీజేపీకి వచ్చే స్థానాలు అయిదుకు మించవని సర్వేలు చెబుతున్నాయి. అకాలీదళ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏదో బీజేపీతో పొత్తు పెట్టుకుని రెండు సార్లు అధికారంలోకి వచ్చింది కానీ.. ఇప్పుడా పరిస్థితి ఏ మాత్రం లేదు. మొత్తంగా పంజాబ్‌లో పోటీ ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే ఉంది.. ఎవరు ఎవరిపై ఆధిక్యత చూపిస్తారన్నది మార్చి 10న తెలుస్తుంది. అప్పటి వరకు సస్పెన్స్‌ తప్పదు.

Related Posts