మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పలు నర్సరీల్లో నీటికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. బోర్లు అడుగంటడడంతో మొక్కలకు నీరు అందని పరిస్థితి. పైగా వేసవి కావడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. మొక్కలను పరిరక్షించేందుకు నర్సరీ నిర్వాహకులు, సిబ్బంది తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలితాన్నివ్వడంలేదు. ట్యాంకర్లతో నీటిని తెప్పిస్తున్నా ఆర్ధికంగా భారంగా మారింది. దీంతో నర్సరీల్లో మొక్కలు వాడిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే చాలా నర్సరీల్లో బోర్లలో నీటిమట్టం దిగజారిపోయింది. దీంతో మొక్కలను నీటి వనరులు ఉన్న నర్సరీలకు మార్పు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని నర్సరీల్లో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. నాగర్కర్నూల్ జిల్లా మినహాయిస్తే మూడు జిల్లాల్లోని నర్సరీల్లో నీటి సమస్య ఉత్పన్నమైంది. ప్రస్తుతం అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడుతుండటంతో సమస్య మరీ దారుణంగా లేదు. అయితే రాబోయే రోజుల్లో ఎండలు పెరిగే అవకాశాలే ఉన్నాయి. దీంతో మొక్కలకు నీరు అందించడం కష్టంగా మారుతుందనే అంతా భావిస్తున్నారు.
బోర్లలో నీటి మట్టం తగ్గిపోవడంతో మొక్కల పెంపకం భారంగా మారిందని నర్సరీ నిర్వాహకులు అంటున్నారు. కొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతోపాటు ట్యాంకుల్లో నీటిని నిల్వ ఉంచుకొని మొక్కలకు నీరు పోస్తున్నామని చెప్తున్నారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నీటి సమస్య కూడా అదే స్థాయిలో ఉంది. నీటి కొరత వల్ల మొక్కలనిర్వహణ భారం పెరిగిందని అంటున్నారు. ర్షాభావ పరిస్థితుల కారణంగా గతేడాది చాలా మొక్కలు నర్సరీల్లో ఉండిపోయాయి. మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 40 లక్షల మొక్కలు కేవలం నర్సరీల్లోనే మిగిలిపోయాయి. ప్రస్తుతం ఈ మొక్కలు పెరగడంతో ఇతర కవర్లలోకి వాటిని మార్చేందుకు యత్నిస్తున్నారు. మొత్తంగా బోర్లలో నీరు అడుగంటడంతో మహబూబ్ నగర్ జిల్లాలోని పలు నర్సరీల్లో మొక్కల నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. నీరు లేక మొక్కలు వాడిపోతున్నాయి. ఈ సమస్యపై స్పందించి అధికారయంత్రాంగం మొక్కలను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.