YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్..? పీకే మధ్యవర్తిత్వం కలిసొచ్చేనా

రాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్..? పీకే మధ్యవర్తిత్వం కలిసొచ్చేనా

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25,
భారత రాష్ట్రపతి పదవి కాలం త్వరలో ముగియనుంది. జులై లేదా ఆగస్టులో ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. ఏకపక్షంగా దేశాన్ని ఏలుతున్న బీజేపీకి పోటీగా ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులను నియమించాలని భావిస్తున్నాయి దేశంలోని ఎన్డీయేతర పార్టీలు. ముఖ్యంగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. రాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్‌ను నిలబెట్టాలని విపక్షాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నితీష్ కుమార్ కొట్టిపారేసినప్పటికీ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఇటీవల పీకేతో నితీశ్ కుమార్ భేటీని బట్టి ఏదో జరుగుతోంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.పీకేతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నితీష్ కుమార్.. తమ మధ్య ఎలాంటి రాజకీయపరమైన చర్చలు రాలేదని, కేవలం మంచి చెడుల గురించే మాట్లాడుకున్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఈ కామెంట్స్ నమ్మశక్యంగా లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే.. నితీశ్‌తో భేటీకి ముందు.. శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లతో పీకే భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే నితీశ్‌ కుమార్‌తోనూ ఆయన భేటీ కావడంతో రాజకీయంగా అనుమానాలకు తావిచ్చింది. అంతేకాదు.. వీరేకాకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఉవ్విళ్లూరుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మరికొందరు కీలక నేతలతో పీకే మంతనాలు సాగించారు. దీనంతటికీ కారణం.. నితీశ్‌ను రాష్ట్రపతిగా పోయించాలనే ఉద్దేశమే అని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం.. ప్రస్తుతం దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడిపోతే.. దేశ రాజకీయాలు అనూహ్యంగా మారే అవకాశం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నాలను వేగవంతం చేయడం ఖాయం అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాకేష్ దీక్షిత్ అభిప్రాయపడ్డారు. తాను రాష్ట్రపతి పదవి పోటీలో లేని నితీశ్ కుమార్ తెలివిగా దాటవేసినప్పటికీ.. అలాంటి ప్రయత్నాలను కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి సంపూర్ణ ఆధిక్యం ఉంది. త్వరలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ప్రతిపక్షాలకు ఆ అవకాశం చాలా తక్కువే. ఇలాంటి నేపథ్యంలో నితీశ్ కుమార్ తన అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత పరిస్థితి మారే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా యూపీ ఎన్నికల్లో బీజేపీ పడిపోతే.. ప్రతిపక్షాలు పుంజుకోవడం ఖాయం అవుతుంది. 2024 లోక్ సభ ఎన్నికల కోసం ఒక్కటయ్యేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దానికంటే ముందు.. త్వరలో రానున్న రాష్ట్రపతి ఎన్నికలో ఈ ఐక్యత కోసం ట్రయల్స్ వేయనున్నాయి. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చాలా కాలం తరువాత ఇటీవల కలుసుకున్నారు. అయితే, గతంలో ఎంతో సన్నిహితంగా ఉండే వీరిద్దరూ.. కొంతకాలం క్రితం దూరంగా ఉంటూ వచ్చారు. వీరి సాన్నిహిత్యం ఏంటంటే.. పార్టీ నేతలందరు వ్యతిరేకించినా పీకేని పార్టీ(జేడీయూ)కి ఉపాధ్యక్షుడిని చేశారు. కానీ, ఆ పదవిలో పీకే ఎక్కువ కాలం ఉండలేకపోయారు. పార్టీలోని అంతర్గత కారణాలతో ప్రశాంత్ కిషోర్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో పీకే.. తన మునుపటి పని అయిన రాజకీయ వ్యూహకర్తగా చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలు పీకే, నితీశ్ కుమార్‌ను మళ్లీ ఏకం చేశాయి.రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో దేశంలో ప్రధాన పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రశాంత్ కిశోర్. ఇదే పనిలో నిమగ్నమై.. బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ప్రధాని దేవెగౌడ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నితీశ్ కుమార్‌కు కూడా ఇదే అంశంపై దిశానిర్దేశం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే కసరత్తును ప్రారంభించిన కె చంద్రశేఖర్ రావు, ఇతర పార్టీలను సంప్రదించేలా నితీష్ కుమార్‌ను ఒప్పించే బాధ్యతను ప్రశాంత్ కిషోర్‌కు అప్పగించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన వీరి భేటీలో ఈ ఆలోచనకు పురుడుపోసుకుంది. ప్రస్తుతం ఈ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్ కుమార్ నిలబడితే.. కాంగ్రెస్ మద్ధతు ఇస్తుందా? లేదా? అన్నది సందేహంగా మారింది. కాంగ్రెస్ లేకుండా విపక్షాల ఐక్యత అనేది సాధ్యం కాదని చాలామంది నాయకులు అంటున్నప్పటికీ.. పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి నితీశ్ కుమార్‌పై ఎలాంటి ద్వేషం లేదు. ఆయన రాష్ట్రపతిగా పోటీ చేస్తే మద్ధతు ఇచ్చేలా ఒప్పించడం సులభమే అంటున్నారు విశ్లేషకులు. అయితే, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్.. విపక్షాల కూటమికి తానే నేతృత్వం వహించాలని కురుకుంటోంది. దీన్నిబట్టి చూస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదించిన బీజేపీయేతర, కాంగ్రెసేతర ఐక్య ఉద్యమం ఫలించే అవకాశం లేదు. అలాగని, కాంగ్రెస్ మద్ధతు లేకుండా ఏ ప్రతిపక్ష అభ్యర్థి కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధిస్తారనే ఆశించలేని పరిస్థితి ఉంది. అందుకే.. కాంగ్రెస్ మద్ధతు నితీశ్ కుమార్‌కు అనివార్యం. ఇక రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్ బలమైన అభ్యర్థిగా ఉండాలంటే.. బిహార్‌లో ప్రత్యర్థి అయిన ఆర్జేడీ మద్ధతు కూడా అవసరం పడుతుంది. మరి వీరందరి మద్ధతును నితీశ్ కూడగడతారా? విపక్షాలన్నీ ఏకతాటిపైకి వస్తాయా? రాష్ట్రపతి ఎన్నికల్లో తమ సత్తా చాటుతాయా? అనేది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాలి.

Related Posts