కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో 2008లోనే భూగర్భ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. దీనికోసం రూ.76.50 కోట్లు కేటాయించారు. అయితే నాటి నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించిన పనులు పూర్తిస్థాయిలో సాగలేదు. దీంతో ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇన్స్పెక్షన్ ఛాంబర్ల నిర్మాణం ముమ్మరం చేసి గృహాల వద్ద అనుసంధానాన్ని పూర్తి చేయాలని అనుకుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా అనుసంధానం పనులు మందకొడిగా సాగుతున్నాయని, ఫలితంగా తిప్పలు తప్పడంలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన పనుల్లో ప్రధాన పైపులైన్ల కనెక్షన్ల కోసం పలు చోట్ల రోడ్లు తవ్వుతున్నారు. వీటన్నింటిని పూర్తి చేయాల్సి ఉండటంతో చర్యలు తీసుకుంటున్నా పనుల్లో మాత్రం ప్రగతి కన్పించడం లేదు. హౌసింగ్బోర్డ్ కాలనీలో ప్రధాన పైపులైను వేసేందుకు తవ్వకాలు జరిపారు. అయితే ఆ పనిఇప్పటికీ పూర్తి చేయలేదు. నెలల తరబడి రోడ్డు మూసివేయడంతో రాకపోకలు సాగించేందుకు ప్రజలు నానాపాట్లు పడుతున్నారు.
ఇంటిలోని మురుగు నీటిని భూగర్భ మురుగు కాల్వల్లోకి తరలించడానికి ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటుచేయాలి. దీనికి సంబంధించి ఐదు డివిజన్లలో అనుసంధానం పనులు పూర్తి చేశారు. మిగతా పనులు చేపడుతున్నారు. ఈ పనులను ప్రణాళిక ప్రకారం చేయాల్సి ఉంది. అయితే తవ్వకాలు జరిపేవారు ఒక చోట తవ్వి పూర్తి చేయకుండానే వదిలేస్తున్నారని స్థానికులు అంటున్నారు. తవ్విన చోట పనులు పూర్తి చేయాల్సి ఉండగా రోజుల తరబడి పనులు చేయకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. అభివృద్ధి పనుల పేరుతో రోడ్లు తవ్వితే ఆ ప్రాంతవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. వీధుల్లో కొత్తగా రోడ్లు వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆ రోడ్డుపై మళ్లీ తవ్వకుండా ఉండేందుకు భూగర్భ పనులు ప్రారంభించారు. మ్యాన్హోల్ నుంచి నుంచి ఇంటికి కనెక్షన్ ఇచ్చేందుకు ఇన్స్పెక్షన్ ఛాంబర్లు ఏర్పాటుచేస్తున్నారు. కానీ సత్వరమే రహదారులు నిర్మించకపోవడం, రోడ్డు కంటే ఛాంబర్లను ఎత్తుగా నిర్మిస్తుండటంతో సమస్యలకు తావిస్తోంది. అటుగా రాకపోకలు ప్రమాదకరంగా మారడంతో ప్రజలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.