మహానగరంలోని సుమారు నాలుగు లక్షల 54వేల వీది దీపాల స్థానంలో ఎల్ఇడి లైట్ల ఏర్పాటుకు ఎట్టకేలకు అడ్డంకులు తొలగాయి. ఇప్పటి వరకు నగరంలోని అన్ని ప్రాంతాల్లోని వీది దీపాలను 53 ప్యాకేజీలుగా నిర్వహిస్తుండగా, వీటిలో ఎక్కువ ప్యాకేజీలను ఒక రాజకీయపార్టీకి చెందిన నేతల చేతుల్లో ఉండటంతో ఎల్ఇడి లైట్ల ప్రతిపాదనకు ఏళ్ల క్రితమే అడ్డంకులేర్పడ్డాయి. కానీ విద్యుత్ వినియోగాన్ని ఆదా చేయటంతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ వెలుగులిచ్చే ఎల్ఇడి లైట్లనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీవో జారీ చేసింది. అన్ని సాంప్రదాయ విద్యుత్ బల్బుల స్థానంలో ఎల్ఇడి లైట్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషీయన్స్ సర్వీసు లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సంస్థతో వారం రోజుల్లో ఒప్పందం చేసుకునేందుకు జిహెచ్ఎంసి సిద్ధమైంది. ఇందుకు సంబంధించి విధి విధానాలను సిద్ధం చేయాలని, లైట్ల ఏర్పాటు ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని కూడా ఇటీవలే కమిషనర్ జనార్దన్ రెడ్డి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలిచ్చారు. నగరంలో విద్యుత్ లైట్లకు సంబంధించి 24వేల 500 మీటర్లను ఏర్పాటు చేయాల్సి ఉందని, వీటి ప్రక్రియ ప్రస్తుతం దాదాపు తుది దశలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నగరం మొత్తం ఎల్ఇడి లైట్లను ఏర్పాటు చేయటంతో పాటు వివిధ వర్గాలకు చెందిన ప్రజల పండుగలు, పబ్బాలకు కూడా జిహెచ్ఎంసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే లైట్ల స్థానంలో కూడా ఎల్ఇడి లైట్లనే ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రంజాన్ మాసానికి కూడా అయిదు వేల ఎల్ఇడి లైట్లనే ఏర్పాటు చేయాలని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. దీంతో పాటు జిహెచ్ఎంసికి చెందిన అన్ని రకాల కార్యాలయల్లో సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసే బాధ్యతను ‘తెరి’ అనే సంస్థకు అప్పగించారు. గడిచిన ఏడాది కాలం నుంచే విద్యుత్ ఆదా మంత్రాన్ని జపిస్తున్న జిహెచ్ఎంసి గత ఆర్థిక సంవత్సరం వీది ధీపాల నిర్వాహణ వ్యయాన్ని సుమారు రూ. 70లక్షల వరకు తగ్గించుకుంది. ఈ క్రమంలో ఎల్ఇడి లైట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే నెలకు జిహెచ్ఎంసి చెల్లిస్తున్న విద్యుత్ బిల్లు తగ్గటంతో పాటు విద్యుత్ కూడా ఆదా అవుతోంది.