తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏమిటి..? ఈనెలలో నిర్వహించనున్న మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు... ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర విభజన తర్వాత 2014ఎన్నికల్లోనూ టీటీడీపీ పలు స్థానాలను కైవసం చేసుకుంది. మెజారిటీ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్లకు దీటుగా ఆ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒక్కొక్కరుగా పార్టీని వీడడం మొదలైంది. ఒక్కరు తప్ప దాదాపుగా పార్టీ ఎమ్మెల్యేలందరూ అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లోకి వలస వెళ్లారు. మరో వైపు తెలంగాణలో క్రమంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటోంది. అధికార టీఆర్ఎస్పై కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తెలంగాణ జన సమితి కూడా ఎన్నికల్లో సత్తాచాటేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకూ పూర్తి మెజారిటీ రాదనే టాక్ ఇప్పటికే బలంగా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గెలుచుకునే కొన్నిసీట్లు అయినా ప్రభుత్వ ఏర్పాటులో కీలకం అవుతాయని పలువురు నాయకులు అంటున్నారు.చాలావరకు టీఆర్ఎస్ గూటికి చేరగా.. ఆ సంప్రదాయానికి భిన్నంగా కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటికే ద్వితీయశ్రేణి నాయకత్వం కూడా పార్టీని వీడుతోంది. దీంతో టీటీడీపీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందితెలంగాణలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగిన, బలమైన క్యాడర్ ఉంది. కానీ, సరైన నాయకత్వం లేకపోవడంతో క్యాడర్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది.మొన్నటికి మొన్న బీసీ సంక్షేమ సంఘం ఉద్యమ నేత, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కూడా పార్టీని వీడారు. తాజాగా.. తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్రెడ్డితోపాటు మరో నాయకుడు మదన్మోహన్రావు కూడా పార్టీని వీడి, కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇలా నేతల వలసలు ఆగకపోవడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదనీ బీజేపీ తేల్చి చెప్పిన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు తెలిసిందే. బీజేపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇక ఈనెలలో నిర్వహిస్తున్న మహానాడులో చంద్రబాబు టీటీడీపీకి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.వచ్చే ఎన్నికల్లో టీటీడీపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందా..? లేక ఒంటరిగానే బరిలోకి దిగుతుందా..? అన్నది ఇప్పుడు తెలంగాణలో హాట్టాపిక్గా మారింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న అధికార టీఆర్ఎస్తో కలిసినడిచే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఓటుకునోటు కేసును సీఎం కేసీఆర్ మళ్లీ కెలికారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ కేసును మళ్లీ తెరమీదకు తెస్తున్నారు. బీజేపీతో పొత్తు కుదిరే సమస్యే లేదు. ఇక మిగిలిందల్లా కాంగ్రెస్, సీపీఎం నేతృత్వంలో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్, నూతనంగా ఏర్పడిన తెలంగాణ జనసమితి. అధికార టీఆర్ఎస్ను ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ కలిసినడిచేందుకు అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్లో పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలోనూ చంద్రబాబు ఇదే విషయం చెప్పారు. పొత్తులపై తొందరపడాల్సిన అవసరం లేదనీ.. ముందుగా పార్టీని బలోపేతం చేయాలని, వచ్చే ఎన్నికల్లో మనమే కీలకంగా మారుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందుకే ఇప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఇతర పార్టీలు కూడా కీలకభాగస్వామిగానే చూస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి మరి.