తెలంగాణకు బీజేపీ అగ్రనాయకత్వం రంగం సిద్ధం చేసింది… తరచు జాతీయ నేతల పర్యటనలు అమిత్ షా పరివేక్షణలో తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారు.. ఇదే అంశంపై రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మన్ సోమవారం ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో భేటీ అయ్యారు. 2019 లోక్సభ ఎన్నికలు, అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల అంశంపై వీరిద్దరి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.2019 ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ తెలంగాణలో పాగా వేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది.. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి భవిష్యత్ కార్యాచరణపై వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం… ఇటీవల గ్రామీణ స్వరాజ్ అభియాన్లో భాగంగా తెలంగాణలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, ముఖ్యంగా దళిత అదాలత్ల నిర్వహణ వంటి కార్యక్రమాలపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అమిత్ షా లక్ష్మణ్ అందజేశారు. ముఖ్యంగా పల్లెల్లో దళితులతో మమేకమవడం లాంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని షా చెప్పినట్లు సమాచారం.. ఈ నెల 18, 19 తేదీల్లో పార్టీ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి సతీష్ జీ రాష్ట్రానికి రానున్నట్లు డాక్టర్ లక్ష్మన్ తెలిపారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన దరిమిలా ఇక తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకునేందుకు పార్టీ జాతీయ నాయకత్వం పక్కా వ్యూహాన్ని రచిస్తుంది. ఇందులో భాగంగా లోక్ సభ నియోజకవర్గ స్థాయి నుంచి పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి పెట్టిందని, లోక్సభ క్లస్టర్ ఇన్ఛార్జ్లు అయిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్, బీహార్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి మంగళ్ పాండే, కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాష్ట్రంలో పర్యటించి పార్టీని పటిష్ఠం చేయనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మే 26న నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా.. దేశవ్యాప్తంగా మోదీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది….