కర్టాటక రాజకీయం రసవత్తరంగా మారింది. నేతల ప్రతి అడుగూ నాటకీయతను సంతరించుకుంటోంది. ఏ పార్టీకి సరైన ఆధిక్యం లేకపోవడంతో పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనేందుకు వేలంపాట మొదలైంది. అవకాశాల కోసం గోడమీద పిల్లిలా కాచుకుని కూర్చున్న ఎమ్మెల్యేల కోసం జాతీయ పార్టీలు వలలు పన్నుతున్నాయి. గంటకో రేటు చొప్పున చకచకా ఎమ్మెల్యేల ధరలు మారుతున్నాయి. ఎలాగైనా తామే అధికారంలోకి రావాలనే పట్టుదలతో పెద్ద పార్టీలు ఉండడంతో ఎమ్మెల్యేల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. బీజేపీతో కలసి వస్తే 25కోట్ల రూపాయలు ఇస్తామన్న ఆఫర్ మధ్యాహ్నం 4 గంటలకల్లా 75కోట్లకు పెరిగిపోయింది. బేరసారాలు మాట్లాడేందుకు స్వయంగా కానీ, వారి రక్తసంబంధీకులు కానీ, వారి తరపున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా పనిచేసినవాళ్లు కానీ, ఎవరొచ్చినా అడ్వాన్స్గా 25కోట్లు ఇచ్చి పంపుతామని బీజేపీ నేతలు హామీ ఇచ్చేస్తున్నారట. కూరగాయలు కొన్నట్టు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సిద్ధపడిపోయారు. భారతీయ జనతా పార్టీ తమ అసలు అస్త్రాన్ని బయటకు తీసింది. అధికారానికి ఏడు సీట్ల దూరంలో ఆగిపోతున్న తరుణంలో అవసరమైన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి ఎంతమందినైనా కొనేయాలంటూ కర్నాటకలోని తమ అప్రకటిత కీలక నాయకుడు గాలి జనార్దనరెడ్డిని పురమాయించినట్లుగా పుకార్లు వస్తున్నాయి.ఇరు పార్టీలకు చెందిన నాయకులు వేగంగా పావులు కదపడం ప్రారంభం అయింది. ఒకవైపు ఢిల్లీనుంచి ముందురోజే వచ్చి బెంగుళూరులో తిష్టవేసిన కాంగ్రెస్ నాయకులు.. లార్జెస్ట్ పార్టీగా అవతరించిన భాజపాను కట్టడి చేయడానికి జేడీఎస్ కు జై కొట్టేశారు. అదే సమయంలో, వారికంటె వేగంగా భాజపా కూడా చక్రంతిప్పడం మొదలు పెట్టింది. ఆ పార్టీ నాయకులు ఇంకా బెంగుళూరుకు చేరుకోకముందే.. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బేరాలు మాట్లాడాల్సిందిగా పురమాయింపులు వచ్చేశాయి.