YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఈ సారైనా... సీఎం వచ్చేనా

ఈ సారైనా... సీఎం వచ్చేనా

ఖమ్మం, ఏప్రిల్ 4,
ప్రతి ఏటా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవడం పరిపాటి. కళ్యాణం రోజు ముఖ్యమంత్రి, శ్రీరామనవమి రోజున గవర్నర్ హాజరై ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు నిర్వహిస్తారు. చాలా ఏళ్లుగా అదే సంప్రదాయం కొనసాగుతోంది. అయితే 2015 లో తొలి తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరయ్యారు. అనంతరం ఆయన ఈ వేడుకలకు హాజరు కాలేదు. రాష్ట్ర మంత్రులు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. గత రెండేళ్లు కోవిడ్ నేపథ్యంలో ఈ ఉత్సవాలను భక్తులు లేకుండా నిరాడంబరంగా నిర్వహించారు.అయితే ఈసారి కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మిథిలా ప్రాంగణంలో భక్తుల సమక్షంలోనే ఈ సారి ఈ వేడుకను జరుపుతున్నారు. ఈసారైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా..? లేదా..? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. ఉగాది రోజున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అధికారులు, అర్చకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ లను కలిసి వేద ఆశీర్వాదం అందజేసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను పంచారు. అయితే తాను ఏప్రిల్ 11న జరగనున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి తప్పకుండా హాజరవుతానని, మరుసటి రోజు 12వ తేదీన కూడా జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటానని రాష్ట్ర గవర్నర్ దేవస్థానం అధికారులకు విన్నవించినట్టు తెలిసింది. దీంతో గవర్నర్ పర్యటన దాదాపు ఖరారు అయినట్లే అని భావిస్తున్నారు.కేసీఆర్ మాత్రం ఆహ్వాన పత్రికను అందుకున్నారు కానీ.. ఎటువంటి విషయం కూడా మాట్లాడలేదని దేవస్థానంలో కొందరు ఉద్యోగులు దిశ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే సీఎం కార్యాలయం ఉద్యోగులు మాత్రం.. సీఎం ఈసారి వచ్చే అవకాశం ఉందని సూచన ప్రాయంగా వారికి తెలియజేసినట్లు సమాచారం. ఏదేమైనా పూర్తి స్పష్టత మాత్రం రాలేదు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు వస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు. ఏమైనా భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకల పై ఈసారి హాట్ హాట్ చర్చ జరుగుతోంది. ప్రముఖులు ఈ వేడుకకు తరలి వస్తారు అన్న ప్రచారంతో సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.భద్రాచలం భవిష్యత్ పై పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే భద్రాచలాన్ని సర్వనాశనం చేశారని ఇకనైనా రాజకీయాన్ని పక్కనపెట్టి రాముని సన్నిధిని బాగు చేయాలని పలు రాజకీయ పార్టీలు గొంతెత్తి నినదిస్తున్నారు. ఇందుకోసం అఖిలపక్షం గా ఏర్పడి పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నారు.భద్రాచలం నుంచి విడదీసిన 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలోకి తీసుకురావాలని, పోలవరం ముంపు నుంచి భద్రాద్రి ఏజెన్సీని కాపాడాలని, భద్రాద్రికి రైల్వే లైన్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, సీఎం కేసీఆర్ ప్రకటించిన రూ.100 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని, భద్రాచలాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయాలని తదితర డిమాండ్లతో అఖిలపక్షం పోరాటం నిర్వహించాలని తగు వ్యూహరచన చేస్తుంది. కేంద్ర హోం మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయంపై దృష్టి సారించాలని, సీఎం కేసీఆర్ భద్రాద్రి భవితవ్యంపై క్లారిటీ ఇవ్వాలని అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది.

Related Posts