YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎంతెంత దూరం... పెరుగుతున్నభారం

ఎంతెంత దూరం... పెరుగుతున్నభారం

హైదరాబాద్, ఏప్రిల్ 8,
తెలంగాణ ప్రభుత్వం-గవర్నర్ మధ్య దూరం పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తనను గౌరవించడం లేదన్నది రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెబుతున్న మాట. వ్యక్తిగా తనను పట్టించుకోక పోయినా ఫర్వాలేదు.. రాజ్యాంగబద్దమైన పోస్టుకు విలువ ఇవ్వాలి.. ప్రోటోకాల్ పాటించాలంటూ హస్తిన వేదికగానే గవర్నర్ చెప్పడం హాట్ టాపికైంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసొచ్చాక గవర్నర్ మాట్లాడిన మాటలు తెలంగాణలో మంటలు రేపుతున్నాయి. విషయం ఏదైనా ఇప్పుడు గవర్నర్ కు, తెలంగాణ సర్కార్ కు మధ్య అసలు పొసగడం లేదు. మొదట్లో బాగానే ఉన్నా ఈ మధ్య కాలంలో అది ముదిరిపాకాన పడింది. గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుని బీజేపీ రాజకీయం చేస్తుందని టీఆర్ఎస్ లీడర్లు అంటుంటే..ఆ పోస్టుకు విలువ ఇవ్వని వారితో వాదించాల్సి రావడం దురదృష్టకరం అంటోంది మరోవైపు బీజేపీ. మొత్తంగా గవర్నర్ వర్సెస్ తెలంగాణ సర్కార్ అన్నట్లుగా రాజకీయాలు మారిన తీరు ఉత్కంఠను పెంచుతోంది.స్వాతంత్ర్యం వచ్చాక కొన్ని ఏళ్ల పాటు రాజకీయ రంగంలో లేని వారినే గవర్నర్లుగా నియమించేవాళ్లు. వారిలో ఎక్కువ సేవారంగంలో అనుభవం గడించిన వారే ఉండేవాళ్లు. కాలం మారింది… ఇప్పుడు పార్టీలో పని చేసిన వారికే గవర్నర్ల నియామకం ఉంటోంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి సేవలందించిన వారినే ఎక్కువగా నియమిస్తోంది కేంద్ర సర్కార్. ఫలితంగా రాజ్‌భవన్‌ రాజకీయ కేంద్రంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వివాదాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీయేతర పాలిత ప్రాంతాల్లో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వాల మధ్య గొడవలు తక్కువేం కాదు.తెలంగాణ గవర్నర్ గా ఈఎస్‌ఎల్ నరసింహన్ తర్వాత సెప్టెంబర్ 8, 2019న బాధ్యతలు తీసుకున్నారు తమిళి సై సౌందర రాజన్. విద్యార్థి దశ నుంచే చురుగ్గా ఉండే తమిళి సై బీజేపీలో అధికార ప్రతినిధిగా పని చేశారు. తమిళనాడుకు బీజేపీ అధ్యక్షురాలిగా పని చేసిన అనుభవం ఉంది. అలాంటి తమిళి సైని రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ తెలంగాణ గవర్నర్ గా నియమించడంతో అసలు కథ ప్రారంభమైంది. తొలిగా అంతా బాగానే సాగింది. ఆ తర్వాత పొరపచ్చాలు మొదలయ్యాయి. మీరు అట్టు పెడితే మేము అట్టున్నర పెడతాం అన్నట్లుగా విభేదాల జోరు పెరుగుతోంది.
ప్రజాదర్భార్‌ దుమారం (జనవరి2, 2020)
జనవరి2, 2020న ప్రజా దర్భార్ పెట్టేందుకు తెలంగాణ గవర్నర్ తమిళి సై సిద్దమవడం వివాదాల అగ్గిని రాజేసింది. ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే ఆలోచన చేయడమే ఇందుకు కారణం. ప్రగతిభవన్‌కు పోటీగా ఇలా దర్భార్ పెట్టారని విమర్శలు అప్పటి నుంచే వచ్చాయి. వాస్తవం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నమే తప్ప పోటీగా కాదని గవర్నర్ చెప్పినా విమర్శలు ఆగలేదు..
కరోనా దుమారం (ఆగస్టు18, 2020)
ఆగస్టు18, 2020న కరోనా టెస్టులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లు పెట్టాలని సలహానిచ్చారు గవర్నర్ తమిళి సై. అధికారులను రాజ్‌భవన్‌కు పిలిచి సమీక్ష చేశారు. గతంలో డాక్టర్ గా పని చేసిన అనుభవంతోనే ఈ పని చేశారనే వాదన లేకపోలేదు. ఈ సమీక్షకు కీలక అధికారులెవరు వెళ్లక పోవడం దుమారం రేపింది. తన మాటను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. పెడచెవిన పెట్టిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్. నా మాటనే ఖాతరు చేయరా అంటూ గవర్నర్ వ్యాఖ్యానించడం పై మంత్రులు తప్పు పట్టారు. అది ప్రభుత్వం- గవ్నరర్ మధ్య విభేదాలను మరింతగా పెంచింది.
ఎమ్మెల్సీ వివాదం ( సెప్టెంబర్‌ 2021)
సెప్టెంబర్ 2021న పాడి కౌశిక్ రెడ్డిని గ‌వర్న‌ర్ కోటా ఎమ్మెల్సీగా నామినేట్ చేసే ఫైలును పంపారు సిఎం కేసీఆర్. కానీ ఆ పైల్ పై సంతకం చేయలేదు గవర్నర్‌. సామాజిక సేవా విభాగంలో పంపినందున నామినేట్‌ చేయడానికి గవర్నర్‌ తిరస్కరించడం హాట్ టాపికైంది. హూజురాబాద్ ఉప ఎన్నికలు జరిగే సమయంలో కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉంటే తమకు ప్రయోజనం అని భావించింది టీఆర్ఎస్. వీణవంక మండలంతో పాటు..మరికొన్ని చోట్ల కౌశిక్ రెడ్డి ఓటు బ్యాంక్ ఉపయోగపడుతుందని అంచనా వేసింది. ఇందుకు గవర్నర్ సహకరించక పోవడంతో రాజకీయంగా విమర్శలు రేగాయి. గవర్నర్‌ కోటాలో కౌశిక్‌ రెడ్డికి అందులోను సర్వీస్‌ కోటాలో ఇవ్వలేమని గవర్నర్‌ చెప్పడంతో బీజేపీ, గులాబీ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. గవర్నర్ బీజేపీ నేతలు చెప్పిన మాటలు వింటున్నారని టీఆర్ఎస్..గవర్నర్ పై ఒత్తిడి పెంచవద్దని బీజేపీ వాగ్వాదాలు చేసుకున్నాయి.
ఫిర్యాదుల పెట్టె ( 2022 జనవరి 1)
ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలు తీసుకునేందుకు గవర్నర్ తమిళి సై తీసుకున్న నిర్ణయం పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ప్రభుత్వం ఉండగా…గవర్నర్ ప్రత్యేకంగా ఫిర్యాదుల పెట్టె ఎందుకు పెట్టాలనేది టీఆర్ఎస్ మాటగా ఉంది. గవర్నర్‌ నిర్ణయంపై ప్రభుత్వ పెద్దల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది.
రిపబ్లిక్‌ డే వివాదం ( 2022 జనవరి 26)
గణతంత్ర దినోత్సవం నాడు రాజ్‌భవన్‌లో వేడుకలు జరగడం ఆనవాయితీగా వస్తోంది. రాష్ట్రంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, వివిధ రంగాల్లో సేవలందించిన వారికి తేనేటి విందు ఇవ్వడం ఎప్పటినుంచే వస్తున్న సంప్రదాయం. దానికి సీఎంతో పాటు..మంత్రులు, వివిధ వర్గాల ప్రముఖులు హాజరవడం తెలిసిన సంగతే. కానీ జనవరి26, 2022న రాజ్ భవన్ లో జరిగిన ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.
సమ్మక్క-సారక్క జాతర ( 2022 ఫిబ్రవరి 19)
తెలంగాణలో జరిగే పెద్ద జాతర సమక్క-సారక్క. దేశవ్యాప్తంగా ఈ జాతరకు మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి జాతరను చూసేందుకు గవర్నర్ తమిళి సై వెళ్లినప్పుడు ప్రోటోకాల్ ఉండాలి. స్వాగతం పలికేందుకు మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు వెళడం కొత్తేమి కాదు. మేడారం జాతరకు వెళ్లిన గవర్నర్ కు స్వాగతం, వీడ్కోలు పలికేందుకు ములుగు కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌ వంటి వారు ఎవరూ రాలేదు. అది గవర్నర్ కు కోపం తెప్పించింది. వేరే బాధ్యతలు ఉండటం వల్లనే స్వాగత కార్యక్రమానికి వెళ్లలేదనేది అధికారుల మాట.
గవర్నర్ ప్రసంగం లేకుండానే( మార్చి1, 2022)
మార్చి1, 2022న గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది ప్రభుత్వం. గత సమావేశాలు ప్రోరోగ్‌ కానందున సభ లైవ్ లోనే ఉంటుంది. కాబట్టి ఉభయ సభల సమావేశం అవసరం లేదు. గవర్నర్‌ ప్రసంగం అవసరం లేదని భావించింది కాబట్టే టీఆర్ ఎస్‌ సర్కార్‌ పిలవలేదు. సాంకేతికంగా అది తప్పు కాదు. కానీ గవర్నర్ ను పిలవడం ఇష్టం లేదు కాబట్టే ఆ పని చేయలేదు అంటోంది మరోవైపు బీజేపీ.
జాతీయ సాంస్కృతిక మహోత్సవం ( మార్చి29, 2022 )
వరంగల్‌కు వెళ్లిన గవర్నర్ కు ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలికేందుకు వరంగల్ మేయర్ రాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాలేదనేది గవర్నర్ తమిళి సై మాట. బీజేపీ నిర్వహించిన కార్యక్రమం అది. అందుకే వెళ్లలేదనేది టీఆర్ఎస్ నేతల వాదనగా ఉంది.
ఉగాది వేడుకలు ( 2022 ఏప్రిల్‌ 1)
ఏప్రిల్‌ 1, 2022న రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రులు, విపక్ష నేతలను ఆహ్వానించారు గవర్నర్. కానీ అధికార పార్టీకి చెందిన కీలక ప్రజా ప్రతినిధులెవరు హాజరు కాలేదు. ఇది వివాదాన్ని మరింతగా పెంచింది. మేము గవర్నర్ కు విలువనిస్తాం. ప్రోటోకాల్ పాటించలేదనడం కరెక్ట్ కాదన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.
యాదాద్రి ప్రొటోకాల్‌ ( 2022 ఏప్రిల్‌ 02)
ఏప్రిల్ 2, 2022న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శించుకున్నారు గవర్నర్ తమిళి సై. ఆ సందర్భంగా ఆలయ ఈవో గీతారెడ్డి, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ అక్కడకు వెళ్లలేదు. ఆశ్చర్యం ఏంటంటే గవర్నర్ పర్యటన ముగిశాక సాయంత్రం ఆలయంలో జరిగిన ఉగాది ఉత్సవాలు, పంచాంగ శ్రవణంలో ఈవో గీత హాజరవడం విశేషం. స్వాగతంలో ప్రొటోకాల్‌ పాటించని ఈవో, కలెక్టర్‌, ఎస్పీలు వాస్తవాలు ఆలోచించాలని గవర్నర్ హస్తిన వేదికగా ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.
భద్రాచలంలో ఏం జరుగుతుందో…
ఈనెల 10న శ్రీరామనవమి పండుగ నాడు భద్రాచలం వెళ్ళి ఆలయాన్ని దర్శించుకుంటాను. అక్కడకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పాటించడం, పాటించక పోవడం తెలంగాణ సర్కార్ కే వదిలేస్తున్నా అని కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసొచ్చాక గవర్నర్ తమిళి సై ఢిల్లీలో చెప్పడం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. తెలంగాణలో పరిస్థితులను అమిత్ షాకు వివరించాను. కానీ బయటకు చెప్పలేనని ప్రస్తావించడం విశేషం. గవర్నర్ అనే సంగతి పక్కన పెట్టండి. కనీసం ఓ సోదరిగానైనా గౌరవించవచ్చు కదా అని తమిళి సై మీడియాతో చెప్పడంతో కింకర్తవ్యం పై దృష్టి సారించింది తెలంగాణ సర్కార్. ప్రోటోకాల్ లోటును పూడ్చుకునే పని చేస్తుందా లేక పట్టించుకోనట్లు వ్యవహరిస్తుందా అనేది వేచి చూడాలి

Related Posts